ఈ మద్య కొంత మంది చిన్న చిన్న కారణాలకే ఎమోషన్ కి గురి అవుతున్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అర్థరాత్రి కొంత మంది బీభత్సం సృష్టించారు. కొంత మంది కన్నడ యువకులు శ్రీశైల పురవీధుల్లో పెద్ద ఎత్తున గొడవ చేసి దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేశారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న కొన్ని షాపులకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. దీంతో తాము రోడ్డున పడ్డామని లబో దిబో అంటున్నారు షాపు యజమానులు. సుమారు 30లక్షల మేర ఆస్తి నష్టం సృష్టించారు.
శ్రీశైల పుణ్యక్షేత్రం దర్శనం కోసం వెళ్లిన కొంత మంది యువకులు ఒక సత్రం వద్ద ఆగి టీ ఆర్డర్ చేశారు. అదే సమయంలో స్థానిక భక్తులతో కన్నడ యువకులకు గొడవ మొదలైంది. అదే సమయంలో కర్ణాటకకు చెందిన ఒక భక్తుడిపై స్థానికులు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. అతడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. తమ స్నేహితుడిపై దాడి చేశారన్న కోపంతో కన్నడ భక్తులు స్థానిక దుకాణాలకు నిప్పు పెట్టారు. ఫలితంగా ఆలయ పరిసరాల్లోని దుకాణాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
గొడవ జరుగుతున్న సమయంలో డీఎస్పీ శృతి శ్రీశైలం చేరుకున్న తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఈఓ లవన్న కర్ణాటక స్వామిజీలతో మాట్లాడారు. ప్రస్తుతానికి గొడవ సర్ధుమణిగింది. దుకాణాలపై దాడులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, గాయపడిన వ్యక్తిని పరామర్శించిన జగద్గురు పీఠాధిపతి. ప్రస్తుతం అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.