చదువు పూర్తైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఓ కల. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం సంపాదించడం కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న ఆశలను నిజం చేసేందుకు యువతీ యువకులకు గొప్ప అవకాశం అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఏపీలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ప్రతి పాఠశాలను ఆధునీకరిస్తూ, ఆధునిక పద్దుతుల్లో భోదన జరిగేలా కృషి చేస్తోంది. పేదరికాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని చెప్పిన సీఎం జగన్ అంతే చిత్తశుద్దితో విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్నారు. స్కూల్, కాలేజ్ చదివే విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందిస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ తలిపారు. భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం జగన్ ఆమోదించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 3295 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. రాజీవ్ ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ అనుమతించారు. కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు.
తాజాగా యూనివర్సిటీలు, రాజీవ్ ట్రిపుల్ ఐటీల్లో లెక్చరర్ల నియామకాలపై సమీక్ష చేసిన సీఎం జగన్ యూనివర్సిటీల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ సిబ్బంది నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆమోదంతో యూనివర్సిటీల్లో 3295 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ద్వారా ఆగష్టు 23 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అధికారులు. సెప్టెంబరు 3, 4 వారాల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి, అక్టోబరు 10 వ తేదీకల్లా రిసల్ట్స్ విడుదల చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు అధికారులు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నవంబరు 15 నాటికి పూర్తి చేయనున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనుండడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.