మద్యానికి బానిసై అనేక మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. మత్తు కోసం కొంతమంది తాగుతుంటే, యువత మాత్రం ఏకంగా ఇదే నేటి తరం ఫ్యాషన్ అంటూ సీసాలు సీసాలు తాగేస్తున్నారు. దీనికి అలవాటు పడ్డ కొంతమంది భర్తలు కుటుంబాన్ని పిల్లలను పట్టించుకోకుండా ఇంట్లో విలువైన వస్తువులు ఏం కనిపించినా అమ్మటానికి కూడా వెనకాడని పరిస్థితులు ఉన్నాయంటే మత్తు ఎంత పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక భర్తల తాగుడుకు విసిగిపోయిన కర్ణాటకలోని 500 మంది మహిళలు పోరాటానికి దిగారు. అధికారుల సాయంతో ఎన్నిసార్లు మద్యం అమ్మకాలు జరపొద్దని విన్నవించిన ఎలాంటి మార్పులు రాలేదు. ఇక అసహనాన్ని కోల్పోయిన మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో శనివారం చిక్కమగళూరు జిల్లా ముస్లాపుర గ్రామంలో మహిళలు మద్యం దుకాణంపై దాడి చేశారు. ఏకంగా మద్యం షాపులోకి దూసుకెళ్లి ఫర్నీచర్ ను పగలగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.