తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కూతురు వైఎస్ షర్మిల ‘వైఎస్సార్ టీపి ’ని స్థాపించారు. ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై పోరాడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జగన్ గెలుపు కోసం ఎంతో కృషి చేశానన్న వైఎస్ షర్మిల, ఇప్పుడు వారికి తన అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం అక్కడ తన అవసరం లేదని, తన సోదరుడు సీఎం అయ్యాక, వైసీపీ పాలన కొనసాగుతున్న సమయంలో తాను చేయడానికి ఏముంటుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎడాది కల్లా.. కొన్ని కేసుల నేపథ్యంలో సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఉండలేని పరిస్థితి వస్తే.. తదుపరి ముఖ్యమంత్రి స్థానం మీకా.. రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా మీ అమ్మగారికా.. లేదా జగన్ మోహన్ రెడ్డి భార్య భారతికి దక్కుతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా.. షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు అన్నట్టుగా ఒకవేళ వచ్చే ఏడాది వరకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండలేని పరిస్థితి వస్తే.. వారి పార్టీ పరంగా, రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఇప్పుడు రాచరికాలు లేవని, ఓ వ్యక్తి పదవి కోల్పోతే వారి కుటుంబీకులకే ఆ పదవి దక్కాలని ఇప్పుడు ఆశించలేమని వివరించారు. ఇప్పుడు రాజరిక వ్యవస్థలు లేవని.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి తదుపరి సీఎం ఎవరన్నది పార్టీ విధివిధానాలు నిర్ణయిస్తాయని తెలిపారు. తాను ఎంత సేవ చేసినా ఏనాడూ ఒక్క పదవి ఇచ్చింది లేదని అన్నారు. ఇక జగన్ మిమ్మల్ని రాజ్యసభకు పంపుతానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పినట్టు చెప్పుకుంటున్నారు… దీనిపై మీరేమంటారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం తనకు తెలియదని, తాను ఎప్పుడూ రాజ్యసభ సీటు కోరలేదని అన్నారు. విన్న ప్రతి విషయం నిజం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను తెలంగాణలో ఓ మంచి ఆశయంతో పార్టీ పెట్టానని.. ప్రజలు తనను అర్థం చేసుకుంటారని అన్నారు. తన తండ్రి ఎన్నో ఏళ్లు కష్టపడి ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకున్నారని, ఆయన కూతురిగా ప్రజల్లో తనకు విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు.