గత కొంత కాలంగా బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసులో ఆర్యన్ తో పాటు,.. అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమిచ, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, మోహ్క్ జస్వాల్ని ఎన్సిబి విచారించింది.
తాజాగా డ్రగ్స్ తీసుకున్నట్టు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. అర్బాజ్తో కలిసి చరస్ తింటున్నట్లు ఒప్పుకున్నాడని ఎన్సీబీ పంచనామాలో పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకోవడానికే ఈ విహారయాత్రను ఎంచుకున్నట్లు వారు చెప్పారని ఎన్సీబీ తెలిపింది. ఇదిలా ఉంటే.. క్రూయిజ్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఆర్యన్ తరపు న్యాయవాది సతీష్ మన్షిండే బెయిల్ దరఖాస్తును ఫోర్ట్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. దాంతో సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేయనున్నారు. క్రూయిజ్లో సెర్చ్ సమయంలో బూట్లలో దాచిపెట్టిన జిప్ లాక్ పర్సు నుంచి డ్రగ్స్ను గుర్తించినట్లు, అర్బాజ్ నుంచి 6 గ్రాముల చరస్ను కనుగొన్నామని కోర్టు ముందు ఉంచిన పంచనామాలో ఎన్సీబీ పేర్కొన్నట్లు సమాచారం. ఇది కిరణ్ గోసావి, ప్రభాకర్ రఘోజి సేన్ అనే ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఆర్యన్, అర్బాజ్ ల వాంగ్మూలాలతో కేసు పంచనామాను రూపొందించినట్టు తెలుస్తోంది.
పంచనామా ప్రకారం, ఆర్యన్, అర్బాజ్లను ప్రశ్నించడానికి గల కారణాలను ఎన్సీబీ అధికారి ఆశిష్ రంజన్ ప్రసాద్ చెప్పారు. అనంతరం ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 50 గురించి వారిద్దరికీ వివరించారు. ఇక ఫోర్ట్ కోర్టు ఆదేశం కాపీని చూసిన తర్వాత ఏం చేయాలో సోమవారం నిర్ణయించనున్నట్లు ఆర్యన్ తరఫు న్యాయవాది సతీష్ మన్షిండే చెప్పారు. మరోవైపు తన క్లయింట్ ఆర్యన్ కి ఎలాంటి నేరారోపిత ఫిర్యాదులు లేవని.. తెలిసిన వారి ఆహ్వానం మేరకు క్రూయిజ్లో పార్టీకి వెళ్లినట్లు కోర్టుకు తెలిపారు.