టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. అక్టోబర్ 10న మా ఎన్నిక జరగనుంది. గత కొంత కాలంగా మా ఎన్నికలపై ఎన్నా కాంట్రవర్సీలు నడుస్తున్నా.. గెలుపు విషయంలో ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఈ కాంట్రవర్సీలు నడుస్తాయని.. తర్వాత మా కుటుంబ సభ్యులంతా ఒక్కటే అని పోటీ చేస్తున్న సభ్యులు అంటున్న విషయం తెలిసిందే.
మా ఎన్నికలో ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ తమ ప్యానల్ సభ్యులని ప్రటించేశారు. ప్రకాష్ రాజ్ చాలా రోజుల క్రితమే తన ప్యానల్ ప్రకటించగా.. నేడు మంచు విష్ణు కూడా తన ప్యానల్ వివరాలు రిలీజ్ చేశాడు. ఈ ప్యానల్ లో విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేయనుండగా మాదాల రవి, పృథ్వి వైస్ ప్రెసిడెంట్లుగా పోటీ చేస్తున్నారు. రఘుబాబు జనరల్ సెక్రటరీగా, బాబూమోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ పడుతున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ట్రెజరర్ గా శివ బాలాజీ.. జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు పోటీలో నిలిచారు.
అర్చన, గీతా సింగ్, అశోక్ కుమార్, హరినాధ్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాజేశ్వరి రెడ్డి, శశాంక్, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, వడపట్ల, పూజిత, విష్ణు బోపన్న, స్వప్న మాధురి, శ్రీలక్ష్మి, శివన్నారాయణ, రేఖ శ్రీనివాసులు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. విష్ణు ప్యానల్ పై సీనియర్ నరేశ్ స్పందించారు. విష్ణు ప్యానల్ చాలా బాగుందని నరేశ్ ప్రశంసించారు. ప్యానల్ సభ్యులెవరికీ ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. అన్ని ప్రాంతాల వారికి ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. అందరూ చదువుకున్నవారేనని చెప్పారు. యువకులు, అనుభవజ్ఞులను ఎంపిక చేశారని చెప్పారు. మహిళలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. విష్ణు విజయం సాధించాలని కోరుకుంటున్నానని నరేశ్ తెలిపారు. మేనిఫెస్టో కూడా ఇంతే బావుండాలని నరేష్ కోరారు.