అప్పుడప్పుడు ఆకాశంలో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఆ మద్య అరుదైన ఖగోళ దృశ్యం జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యుడి చుట్టూ ఎప్పుడూ చూడని విధంగా ఇంద్రధనస్సు రంగులో ఓ వృత్తాకారం ఏర్పడింది. ఒక గంటకు పైగా కనువిందు చేసింది. అద్బుతమైన ఇంద్ర ధనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆకాశంలో అప్పుడప్పుడు మబ్బులు రక రకాల ఆకారాల్లో కనిపిస్తుంటాయి. ఆ మద్య ఆకాశంలో ఓకార రూపం దర్శనం ఇచ్చిందని ఫోటోలు వైరల్ అయ్యాయి.
తాజాగా మహాలయ అమావాస్య సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బుధవారం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండయ్య గూడెంలోని ఈ అద్భుతం చోటు చేసుకుంది. అక్కడ పూజారి శ్రీనివాస శాస్త్రి ఆకాశంలో శివలింగం ఆకారంలో మబ్బులు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంకేముంది వెంటనే ఆ అద్భుత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి నేరేడుచర్ల మండలంలోని సోమప్ప సోమేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు.
అమావాస్య సందర్భంగా ఆకాశంలో శివలింగం ఇలా దర్శనం ఇవ్వడాన్ని చూసి సంతోషించారు. శివలింగం ఆకాశంలో కన్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో అందరూ ఆ అపురూప దృశ్యాన్ని తిలకించి నమోః నమశ్శివాయా అంటూ భక్తితో పారవశ్యాన్ని పొందారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో స్థానికంగా వైరల్గా మారింది. అనేకమంది వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.