టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి. తన తల్లిని బెదిరించినందుకు గాను ఒక మహిళను అరెస్ట్ చేశారు.
క్రికెటర్ల జీవితాలు చాలా సాఫీగా సాగిపోతాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే మైదానంలో వారు ఎంత రాయల్ గా కనిపించినా వ్యక్తిగతంగా వారి గురించి ఎవరికీ తెలియదు. అయితే కొందరు క్రికెటర్లు ప్రత్యక్షంగా వారి పర్సనల్ లైఫ్ లో కష్టాలు పడుతుంటే మరి కొందరు మాత్రం ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ, శిఖర్ ధావన్ వారి జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి కొన్ని బెదిరింపులు వచ్చాయి. ఒక మహిళ యువరాజ్ తల్లిని బెదిరించగా ఆమెను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు. 2017 లో చివరిసారిగా భారత జట్టుకి ఆడిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత టీమిండియాలో చోటు దక్కలేదు. ఇదంతా పక్కన పెడితే.. యువీ తల్లిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తామంటూ ఒక మహిళ బెదిరించింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో యువీ తల్లి షబ్నం సింగ్ ఒక కేర్ టేకర్ ని నియమించింది. ఆమె పేరు హేమ కౌశిక్. 2022 నుంచి ఈ మహిళ ఆ ఇంటిలో కేర్ టేకర్ గా కొనసాగుతుంది. అయితే ఆమె తీరు ఇటీవలే సరిగా లేకపోవడంతో ఉద్యోగంలో నియమించిన కొన్ని రోజులకే తొలగించేసారు.
దీంతో సదరు మహిళ.. ఈ ఏడాది గత కొన్ని నెలలుగా అంటే మే నుంచి యువీ తల్లికి వాట్సాప్ ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనకు రూ.40 లక్షలు ఇవ్వాల్సిందేనని అలా జరగని పక్షంలో తప్పుడు కేసులో ఇరికిస్తానని చెప్పింది. అంతేకాదు కుటుంబ పరువును కూడా దెబ్బతీస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో యువీ ఫ్యామిలీ గురుగ్రామ్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువీ ఫ్యామిలీ ఫిర్యాదుతో పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు.