ఈరోజుల్లో చాలా మంది తమకు ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నారు. గతం లో అయితే ఆడపిల్ల పుడితే అమ్మో ఆడపిల్ల పుట్టిందా అంటూ పెదవి విరిచేవారు.. అంతెందుకు పెద్దలు కొత్త దంపతులను పండంటి మగబిడ్డకు జన్మనివ్వు అంటూ దీవిస్తుంటారు. అంటే మొదటి సంతానం మగబిడ్డ పుట్టాలి.. వంశాంకురం కావాలని కోరుతుంటారు. దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా కానీ కొందరు ఆడపిల్లలు పుట్టగానే భారం గా భావిస్తున్నారు. ఖర్చు ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారు. కూతురిని కన్న తల్లి కూడా ఆడపిల్ల అని మరచిపోయి కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లను మహాలక్ష్మిలా భావించి సంతోషపడాల్సిన వారు ఇలా మూర్ఖంగా వ్యహరిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.
కానీ.. ఓ వ్యక్తి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందని తెగ సంబరపడిపోయారు. అంతే కాదు ఆ సంబరాన్ని ఊరంతా పంచుకున్నాడు. స్థానికులు తీసి షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు జాతీయ స్థాయిలో అందర్నీ ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నిన్న ఆదివారం జరిగిందీ ఘటన. అంచల్ గుప్తా (30) అనే వ్యక్తి భోపాల్ నగరంలో పానీపూరి సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 17న తనకు కూతురు పుట్టింది. తన మహాలక్ష్మి భూవి మీదకు వచ్చిందని.. గుర్తుగా ఏమైనా చేయాలనుకున్నాడు. తన తాహతకు తగ్గట్టుగా పాప కోసం ఏదైనా చేయాలని భావించాడు. అంతే.. దానికోసం రూ.50వేలు ఖర్చు చేశాడు. ఆదివారం కోలార్ పట్టణ వాసులందరికీ రూ.50వేల ఖర్చు చేసి ఉచితంగా పానీ పూరి అందించాడు.
ఈ సందర్భంగా అంచల్ మాట్లాడుతూ.. ‘నాకు ఆడపిల్ల పుట్టడం ఒక కల. నేను వివాహం చేసుకున్నప్పటి నుంచి నాకు అమ్మాయే పుట్టాలని కోరుకున్నా. కానీ మొదటి సంతానంలో రెండేళ్ల క్రితం కొడుకు జన్మించాడు. నా అదృష్టం బాగుండి ఇప్పుడు అమ్మాయి జన్మించింది. ఈ ఆనందంతో భోపాల్ ప్రజలకు ఉచిత పానీ పూరీని అందించాలని నిర్ణయించుకున్నాను. అంతేగాక వారికి అమ్మాయిలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందనేనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. నాకు చేతనైనంతలో ఏం చేద్దామని ఆలోచించి.. చివరకు ఉచిత పానీపురి పంపిణీ చేయాలనుకున్నాను. అంచల్ గుప్తా చేసిన ఈ ప్రయత్నం స్థానికంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. అతని నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తూ ప్రశంసిస్తున్నారు.