న్యూ ఢిల్లీ- మనం ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాం.. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది.. ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేయగానే.. మేం పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు పర్సనల్ లోన్ కావాలా అని అడుగుతారు. మనకు ఎక్కడలేని కోపం వస్తుంది. ఇలాంటి టెలీ మార్కెటింగ్ కాల్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాగా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కాల్స్ వస్తుంటాయి.
మనం ఏదో ముఖ్యమైన కాల్ అనుకుని లిఫ్ట్ చేస్తే అది టెలీ కాలర్స్ ఫోన్ అయి ఉంటుంది. ఇదిగో ఇలాంటి అనసవరమైన ఫోన్ కాల్స్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తెస్తోంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం కొత్త రూల్స్ ను రూపొందిస్తోంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే టెలికం సబ్స్క్రైబర్లకు ఈ పెస్కీ కాల్స్ సమస్య నుంచి విముక్తి లభించవచ్చు.
టెలీ మార్కెటింగ్ కాలర్లపై 10 వేల రూపాయల జరిమానా విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం నిర్ణయించినట్లు తెలుస్తోంది. టెలీ మార్కెటర్లు చేసే ప్రతి కాల్, ఎస్ఎంఎస్కు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే 50 ఉల్లంఘనల తర్వాతనే కఠిన రూల్స్ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక మొదటి 10 టెలీ కాల్స్వరకు ఉల్లంఘనలకు వెయ్యి రూపాయలు, 10 నుంచి 50 ఉల్లంఘనలకు 5 వేల రూపాయలు, 50 ఉల్లంఘనల తర్వాత ప్రతి ఒక్క కాల్, ఎస్ఎంఎస్కు 10 వేల రూపాయలు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తే అప్పుడు మనకు ఈ అనవసరపు ఫోన్ కాల్స్ నుంచి విముక్తి లభించినట్టేనని చెప్పవచ్చు.