కోల్ కత్తా (నేషనల్ డెస్క్)- మామూలు సర్పంచ్ గా పోటీ చేయాలంటేనే లక్షల రూపాయలు కావాలి. అదే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే.. సామాన్యుల వల్లే అయ్యే పనేనా.. అసలు ఉహించుకోవడానికి వీలు కాని ఆలోచన ఇది. కానీ అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఓ సాధారణ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది. అది కూడా మామూలు కూలీ చేసుకుని జీవనం సాగించే మహిళ ఎమ్మెల్యే కావడమంటే నిజంగా ఆశ్చర్యమే కదా. పశ్చిమ బెంగాల్లోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ సాధారణ రోజు కూలీ చందనా బౌరి. ఆమె భర్త కూడా రోజు వారి కూలీనే. ప్రతి రోజు కూలీ చేసుకుంటే గాని తిండి తినలేని నిరుపేద కుటుంబం. అయితేనేం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సాధించిన అపూర్వ విజయం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. అందే కాదు ఆమెగెలుపు ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది. పశ్చిమ బెంగాల్లోని సల్తోరా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసింది చందనా బౌరి.
అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ మండల్ పై 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం ఔరా అనిపించింది. దీంతో ప్రముఖ రాజకీయ నాయకులు ఆమె విజయంపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారుప. కనీసం కరెంటు సదుపాయం కూడా లేని ఒక గుడిసె, మూడు మేకలు, మూడు ఆవులు మాత్రమే ఆస్తులుగా కలిగిన చందన ఏకంగా ఎమ్మెల్యే అయ్యింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన చందన అనూహ్యంగా బీజేపీ నుంచి టికెట్ దక్కించుకుని, గెలిచి దేశంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.