మలయాళం మెగా స్టార్ మమ్ముటి కొడుకు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’ మూవీతో తెలుగు వారికి పరిచయం అయ్యాడు సల్మాన్. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహా నటి’ సినిమాలో జెమిని గణేశణ్ పాత్రలో దుల్కర్ నటించాడు. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇలా దుల్కర్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. తాజా దుల్కర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కురుప్’ కి అరుదైన ఘనత దక్కింది. కురుప్ మూవీ ట్రైలర్ను దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం.
ఈ భవనంపై తొలిసారి ఒక సౌత్ ఇండియా మూవీ ట్రైలర్ను ప్రదర్శించారు. కురుప్ చిత్రాన్ని శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కిస్తుండగా.. డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శోభిత ధూళిపాల శారద కురుప్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ కొత్త లుక్లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచేసింది. భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురుప్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘కురుప్’. నవంబరు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.