ఈ మద్య సినీ ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూ వస్తున్నాయి. సీనీ దిగ్గజ నటులు, దర్శక,నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కృష్ణం రాజు మరణ వార్త జీర్ణించుకోకముందే.. సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూశాడు. ఇక బాలీవుడ్ ని సైతం కొంత కాలంగా విషాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్ కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. తబస్సుమ్ మరణ వార్త తెలిసిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది.
బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్ గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారని తమస్సుమ్ తనయుడు హుషాంగ్ గోవిల్ తెలిపారు. వాస్తవానికి ఆమె శుక్రవారం రాత్రి కన్నుమూసినప్పటికీ.. దీనికి సంబంధించిన సమాచారం మాత్రం శనివారం వెలుగులోకి వచ్చింది. అయితే తన తల్లి ఖననం అయ్యేవరకు ఎవరికీ చెప్పవొద్దని మాట తీసుకున్న కారణంగా మీడియాకు తెలపలేదని అన్నాడు హుషాంగ్ గోవిల్. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు.
ముంబాయిలో జన్మించిన తబస్సుమ్ గోవిల్ 1947 లో ‘మేరా సుహాగ్’ చిత్రంతో బాలనటిగా కెరీర్ ఆరంభించింది. ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి నటించింది. బాలీవుడ్ లో ఆమెను బేబీ తబస్సుమ్ అని పిలిచేవారు. ప్రముఖ దూరదర్శన్ లో సెలబ్రెటీ టాక్ షో ‘ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్’ అనే టాక్ షో లో ఎంతో మంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసింది. అలాగే ఓ ఛానెల్ లో లేడీస్ స్పెషల్ టీవీ షోలో జడ్జీగా వ్యవహరించింది. రామాణయంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ సోదరుడు విజయ్ గోవిల్ ని పెళ్లి చేసుకుంది తబస్సుమ్. చివరిసారిగా 1990లో స్వర్గ్ చిత్రంలో నటించింది. ఆమె మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.