దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. కరోనాను కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్ అమలు చేస్తున్నా కట్టడి కావడం లేదు. నగరాలు, పట్టణాలతో పాటుగా ఈ వైరస్ ఇప్పుడు గ్రామాలను సైతం చుట్టేస్తోంది. దీంతో గ్రామాలు కరోనా బారిన పడుతున్నాయి. గ్రామాల్లో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో కరోనా వ్యాపించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్లో గ్రామాల్లో సైతం కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో ‘ప్రజలను ఇక ఆ దేవుడే కాపాడాలి’ అని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. యూపీలోని చిన్న పట్టణాలు, గ్రామాల్లో వైద్య వసతులు చాలా ఘోరంగా ఉన్నాయని.. కొవిడ్ రోగులకు మెరుగైన చికిత్సకు ఆదేశాలివ్వాంటూ దాఖలైన ఒక వ్యాజ్యాన్ని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ‘యూపీ గ్రామాల్లో ప్రజలను ఇక ఆ భగవంతుడే కాపాడాలని ధర్మాసనంలోని జస్టిస్ సిద్ధార్థ్ వర్మ, జస్టిస్ అజీత్ కుమార్లు వ్యాఖ్యానించారు. మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ కుమార్ అనే బాధితుడు టాయ్లెట్లో కుప్పకూలిపోయాడు. తర్వాత అతడిని స్ట్రెచర్పై వేసి సపర్యలు చేసినా అప్పటికే అతడు చనిపోయాడు. అయితే, తర్వాత అతడిని గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాంగా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది పారేశారు. ఇది రాత్రి షిఫ్ట్లో ఉన్న వైద్యుల అజాగ్రత్త, నిర్లక్ష్యానికి పరాకాష్ట అని న్యాయస్థానం పేర్కొంది.యూపీ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి అంటూ వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగిపిన కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. అటు మీరట్ జిల్లాల్లో కరోనా రోగి అదృశ్యంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. యూపీలో ఇప్పటి వరకూ 16.19 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. గత నెలలో రోజువారీ కేసులు 20 వేల మార్క్ దాటాయి. కానీ, అక్కడ మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తమయ్యింది.