షూటర్ దాదిగా అభిమానులచే పిలుచుకునే 89 ఏళ్ల చంద్రో తోమర్ కరోనాతో మృతి చెందారు. శ్వాస ఇబ్బందుల కారణంగా ఆమెను ఏప్రిల్ 26న మీరట్లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్య పరీక్షల్లో ఆమెకు కొవిడ్ పాజిటివ్గా తేలడంతో ఆస్పత్రిలోనే ఆమెకు చికిత్స అందించారు. శుక్రవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది. చంద్రో నీవెక్కడికి వెళ్లావు?’ అని ఈ వెటరన్ షూటర్ సోదరి ప్రకాశి తోమర్ ట్వీట్ చేసింది.
షూటర్ దాది మృతి పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు క్రీడా, సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తనదైన ప్రతిభతో షూటర్ దాది ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారనీ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రిజిజు ట్వీట్ చేశారు. తోమర్ స్ఫూర్తిగా బాలీవుడ్లో ఆమె జీవితకథతో ‘సాండ్ కీ ఆంఖ్’ అనే సినిమా తెరకెక్కింది. అనేకమంది అమ్మాయిలు తమ లక్ష్యాలను చేరుకునేందుకు దాది మార్గదర్శిగా నిలిచారని ఆమె జీవితకథ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ అన్నారు.
కేంద్ర మంత్రి హరి దీప్ సింగ్ పూరి, షూటర్ జాయ్దీప్ కర్మాకర్, బాక్సర్ అఖిల్ కుమార్, రెజ్లర్ సుశీల్ కుమార్, భారత పారాలింపిక్ కమిటీ చీఫ్ దీపా మాలిక్ తదితరులు దాది మృతికి సంతాపం తెలిపారు.