దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. రోజురోజుకి కరోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది, చాలా మంది పేషెంట్లు ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. కరోనా నుండి కోలుకునేందుకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దీని కోసం దేశ వ్యాప్తంగా ఎదురుచూపులు చూస్తున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ లేక కరోనా రోగులు చనిపోవడం ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్నాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యమ్నాయలపై దృష్టి సారించింది. ఆక్సిజన్ ప్లాంట్లను ఆయా జిల్లా ఆసుపత్రుల కేంద్రాల్లో ప్లాంట్స్ ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఏపీ లో కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వెన్నెల స్లీపర్, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ పేషెంట్లకు బస్సుల్లోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్ బెడ్లు ఆర్టీసీ ఏర్పాటు చేసింది.వెన్నెల స్లీపర్,ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో ఆర్టీసీ స్లీపర్ బస్సులో 10 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆక్సిజన్ బస్సులు ద్వారా సేవలు అందిస్తామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కరోనా రోగుల చికిత్స అవసరాలకోసం ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన బస్సులను మంత్రి పేర్ని నాని పరిశీలించారు. వీటిని ఆసుపత్రి వసతులు లేని ప్రాంతాలకు తరలించనునట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలపైన బుట్టాయిగూడెం, కె.ఆర్.పురం పీహెచ్ సీల్లో ఆక్సిజన్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.