న్యూ ఢిల్లీ- కాదేది కవితకనర్హం అన్నట్లు.. హ్యాకర్లు దేన్నైనా హ్యాక్ చేసేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోటు నిమిషానికో హ్యాకింగ్ జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రమఖుల సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మొదలు ప్రముఖ కంపెనీలు వెబ్ సైట్లు, బ్యాంకు ఖాతాలు, సర్వర్లు.. ఇలా ఒక్కటేమిటి హ్యాకర్లు అన్నింటినీ హ్యాక్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇదిగో ఇప్పుడు ఏకంగా ఎయిర్ ఇండియా సంస్థపైనే హ్యాకర్లు దాడి చేశారు. భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు. ఈమేరకు భారీ స్థాయిలో ఎయిర్ ఇండియాకు సంబందించిన డేటా చోరీకి గురైంది. ఈ విషయాన్ని ఎయిరిండియా నే స్వయంగా ప్రకటించింది. ఐతే ప్రయాణికులు వ్యక్తిగత సమాచారానికి సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియాకు సంబందించిన ప్యాసింజర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఎస్ఐటీఏ పై ఈ యేడాది ఫిబ్రవరిలో సైబర్ దాడులు జరగాయని సంస్థ పేర్కొంది. దీంతో కొంత మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్టు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. 2011 ఆగస్టు 26 నుంచి 2021 ఫిబ్రవరి 3 మధ్య మొత్తం పదేళ్ల కాలంలో ప్రయాణికులకు సంబంధించిన మొబైల్ నెంబరు, పుట్టిన తేదీ, పాస్ పోర్టు, టికెట్, క్రెడిట్ కార్డుల వివరాల సహా వ్యక్తిగత సమాచారం తస్కరంచబడిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ పదేళ్ల సమయంలో సుమారు 45 లక్షల మంది ప్రయాణీకుల వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు దొంగిలించినట్లు ఎయిర్ ఇండియా అంచనా వేస్తోంది.
సైబర్ దాడులు జరిగిన మూడు నెలల తర్వాత ఇప్పుడు ఎయిర్ ఇండియా సంస్థ డేటా హ్యాక్ కు గురైనట్లు ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎయిర్ ఇండియా సంస్థకు సేవలందించే స్విట్జర్లాండ్కు చెందిన ఎస్ఐటీఏ పై ఫిబ్రవరి 2021 చివరి వారంలో సైబర్ దాడి జరిగినట్లు తెలిపింది. ఐతే సైబర్ దాడి ఏ స్థాయిలో జరిగిందనే దానిపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని ఎస్ఐటీఏ స్పష్టం చేసిందట. జెనీవా కేంద్రంగా పనిచేసే విమానయాన సేవల సంస్థ ఎస్ఐటీఏ, ఎయిరిండియా సహా సింగ్పూర్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా తదితర సంస్థలకు సేవలందిస్తోంది. ఎయిర్ ఇండియా సంస్థ సమాచారం హ్యాక్ కు గురైందన్న సమాచారంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.