క్రైం డెస్క్- హైదరాబాద్ పట్టపగలు కాల్పులు కలకలం రేపుతున్నాయి. కూకట్పల్లిలో ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై గుర్తు తెలియని దుండగుల కాల్పులకు తెగబడ్డారు. సెక్యూరిటీ గార్డ్ తోపాటు ఏటీఎం సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు ఏటీఎంలో పెట్టేందుకు తెచ్చిన డబ్బులు దోచుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పుల్లో సిబ్బందికి కాకుండా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయడ్డవారిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ఎటీఎం మిషిన్ లో డబ్బులు నింపుతుండగా హఠాత్తుగా వచ్చిన దుండగులు తమపై కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. కూకట్పల్లిలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాల్పులకు పాల్పడి డబ్బులు దోచుకెళ్లిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక నగదు ఎంత దోచుకెళ్లారన్నదానిపై కూడా స్పష్టత లేదు.