కష్టపడి చదివితే కష్టాలు ఉండవని అంటారు.. కానీ కొంత మంది బద్దకస్తులు మాత్రం చదువు తక్కువ.. కాపీ కొట్టుడు ఎక్కువ అనే చందంగా ఉంటారు. ఒకప్పుడు చిట్టీలు పెట్టుకొని ఇన్విజిలేటర్లకు తమ పని కానిచ్చేవారు.. కొన్ని సార్లు అడ్డంగా బుక్కయ్యేవారు. కానీ ఈ మద్య కొంత మంది కాపీ కొట్టడంలో హైటెక్ హంగులకు పోతున్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్ లను తెచ్చుకొని అడ్డంగా దొరికిపోతారు. ఇలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్ లో జరిగింది.
రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జాగామినేషన్ కు హాజరైన విద్యార్థులు ఎవరికీ దొరకకుండా చెప్పుల్లో బ్లూటూత్ పెట్టుకుని తమ పని కానివ్వాలనుకున్నారు. వీరిపై అనుమానం రావడంతో ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిలో ఒకరిని అజ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించడంతో ఇదో రాకెట్ అని పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధం ఉన్న మరో నలుగుర్ని అరెస్టు చేశారు. చెప్పుల్లో ఫోన్ తోపాటు బ్లూటూత్ ను కూడా దాయొచ్చు.
ఈ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని పరీక్షలు రాసేందుకు సిద్దమయ్యారు. దొరికిపోయిన అభ్యర్థి చెవిలో ఒక డివైజ్, చెప్పులో ఫోన్ దొరికింది. బయటి నుంచి మరో వ్యక్తి అతడికి సాయం చేస్తున్నాడని గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇది ఒక రాకెట్ లా సాగుతుందని రతన్ లాల్ అనే పోలీసు అధికారి చెప్పారు. ఈ చీటింగ్ చెప్పులను తెలివిగా తయారు చేస్తున్నారని విచారణలో తేలింది. ఇలాంటి చెప్పులను హార్డ్ వేర్ తో కలిపి ఒక్కో జతను రూ.2 లక్షలకు అమ్ముతున్నట్లు సమాచారం.ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.