2020 ప్రాంతంలో ఆనంద్ కొమ్మగట్టు ప్రాంతానికి షూటింగ్ నిమిత్తం వెళ్లారు. అక్కడ ఓ స్థలం ఆయనకు బాగా నచ్చింది. దీంతో ఆయన ఆ స్థలాన్ని కొనాలని భావించారు.
ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ మోసాలు బాగా పెరిగిపోయాయి. మంచి ఇళ్లు ఇప్పిస్తామనో.. స్థలం ఇప్పిస్తామనో చెప్పి మోసాలకు పాల్పడేవారు చాలా మంది తయారు అయ్యారు. సామాన్యులనే కాదు.. సెలెబ్రిటీలను సైతం మోసం చేస్తున్న వారు ఈ సమాజంలో ఉన్నారు. తాజాగా, ప్రముఖ నటుడు ఒకరు రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారు. మోసగాళ్లను నమ్మి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మాస్టర్ ఆనంద్కు నటుడిగా కన్నడనాట మంచి గుర్తింపు ఉంది. ఆయన 2020లో కెంగెరీలోని కొమ్మగట్టు ప్రాంతంలో షూటింగ్ కోసం వెళ్లారు.
అక్కడ స్థలం అమ్మకానికి ఉండటం గుర్తించారు. స్థలాన్ని అమ్మకానికి పెట్టిన మల్టీ లీప్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసుకు వెళ్లారు. ఆ ఆఫీసులో పనిచేసే మనిక, సుధీర్లు ఆనంద్కు తమ వద్ద ఉన్న ఆఫర్స్ గురించి వివరించారు. అవి విన్న తర్వాత ఆనంద్ ఏమీ చెప్పకుండా ఇంటికి వచ్చేశాడు. ఇక, అప్పటినుంచి మనిక, సుధీర్లు ఆనంద్కు ఫోన్ చేసి తమ వద్ద ఉన్న స్కీముల గురించి చెప్పసాగారు. లోన్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు.
దీంతో ఆనంద్ స్థలం కొనడానికి నిశ్చయించుకున్నారు. 70 లక్షలకు బేరం కుదిరింది. ఆయన దాదాపు 18 లక్షల రూపాయలు సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే, నెలలు గడుస్తున్నా అతడికి ఎలాంటి స్పందన రాలేదు. దానికి తోడు ఇప్పిస్తానన్న లోను కూడా ఇప్పించలేదు. తర్వాత ఆ స్థలాలను కూడా వేరే వారికి విక్రయించారు. దీంతో ఆనంద్ పోలీసులను ఆశ్రయించారు. మనిక, సుధీర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.