వరంగల్ క్రైం- హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మానవ మృగం రాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రైవ్లే ట్రాక్ పై రాజు మృత దేహాన్ని గుర్తించారు. దీంతో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కానీ రాజును పోలీసులే చిత్రహింసలకు గురిచేసి, పోలీసులే చంపేశారని అతడి తల్లి, భార్యతో సహా బంధువులు ఆరోపిస్తున్నారు.
ఐతే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రాజు డెడ్ బాడీకి పోస్ట్ మార్టమ్ చేయడంతో అతడి మరణంపై పూర్తి స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. రాజు మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్లు చెబుతున్న దాన్ని బట్టి రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న రాజు మృతదేహాన్ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు కుటుంబ సభ్యులకు అతడి డేడ్ బాడీని చూపించాక, అది రాజు డెడ్ బాడీనే అని వాళ్లు నిర్ధారించుకున్నాకే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
రాజు పోస్టుమార్టంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. రాజు మృతదేహానికి గంటపాటు వరంగల్ ఎంజీఎం ఫోరెన్సిక్ వైద్యులు రజా మాలిక్ పోస్టుమార్టం చేశారు. రాజు మృతదేహంపై ట్రైన్ ద్వార అయిన గాయాలు, గ్రీజు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. అతడి డెడ్ బాడీపై రైల్వే ప్రమాదం గాయాలను గుర్తించినట్లు తెలిపారు. రాజు మృతదేహంపై ఇతర గాయాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించినట్లు చెప్పారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.
మరోవైపు డీఎన్ఏ టెస్ట్ కోసం రాజు ఎముకలు సేకరించినట్లు తెలిపారు. అంతే కాకుండా రాజు మత్తు పదార్థాలు ఏమైనా సేవించాడా అన్నది కూడా పరిశీలిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. పోస్ట్ మార్టమ్ ప్రక్రియ తరువాత రాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి కాకుండా వరంగల్లోని పోతన కాలనీ శ్మశాన వాటికలో బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. తల్లి కుమారుడి చితికి నిప్పటించారు.