తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకీ హీటెక్కుతున్నాయి. తెలంగాణాలో పట్టు సాధించేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడం, వచ్చే ఏడాది డిసెంబర్ లోగా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణాలో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో కాషాయ జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతుంది, అదే సమయంలో క్రేజ్ ఉన్న సినిమా నటులను పార్టీ తరపున ప్రచారం చేసేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, నితిన్ లని కలిసినట్టు తెలుస్తోంది. ఇక సినీ నటి జీవిత రాజశేఖర్ బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో జీవితా రాజశేఖర్ దంపతులు అనేక పార్టీలు మారిన విషయం తెలిసిందే. ఏ పార్టీ తమను పట్టించుకోకపోవడంతో ఈసారి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తనకు టికెట్ ఇస్తారా? లేదా? అనే అంశంపై ముందుగానే క్లారిటీ తీసుకుంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం కోరితే.. తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయమై టికెట్ అంశం గురించి ఆమె బండి సంజయ్ దగ్గర ప్రతిపాదన ఉంచారని తెలుస్తోంది.
పార్టీ టికెట్ ఇస్తేనే బీజేపీ తరపున ప్రచారం చేస్తానని ఆమె నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి జీవితను బరిలో నిలబెట్టాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలనేది జీవిత రాజశేఖర్ కల. మరి ఎమ్మెల్యేగా జీవిత కోరిక నెరవేరుతుందా? లేదా? దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.