బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ మొత్తం ఇన్నిరోజలు గొడవలు, కొట్లాటతో సాగింది. కానీ, బుధవారం నుంచి హౌస్, హౌస్మేట్స్, ప్రేక్షకులు అంతా బరువెక్కిన హృదయాలు, చెమ్మగిల్లిన కళ్లతో ఉన్నారు. ఎందుకంటే సిసింద్రీ టాస్క్ తర్వాత అంతా తమ జీవితంలో జరిగిన కొన్ని విషాద ఘటనలను వెల్లడించారు. ఒక్కొక్కరి కథ గుండెలు పిండేలా ఉంది. వారందరిలో కీర్తీ భట్, శ్రీసత్య కథలు మాత్రం అందరినీ ఏడిపించేశాయి. రాత్రి మొత్తం ఇంట్లోని సభ్యులు అదే మూడ్లో ఉండిపోయారు. ఉదయం కూడా అంతా ఏడుపు మొహాలతోనే ఉన్నారు. కొందరైతే రాత్రంతా కూర్చొని ఏడ్చారు. వీరిలో శ్రీసత్య ఎంతో ఎమోషనల్ అయ్యింది.
అసలు శ్రీ సత్య జీవితంలో ఏం జరిగిందంటే.. “పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులు మీ మాట వినడం లేదని, మీరు అడిగింది చేయడం లేదని తిట్టుకోకండి. వాళ్లు ఏది చెప్పినా మీ మంచికోసమే చెబుతారు. ముందు మీరు తల్లిదండ్రుల కోసం ఏం చేయాలి? చేస్తున్నారు అనే దానిని ఆలోచించండి. నేను నా లైఫ్లో చేసిన తప్పు వల్ల మా అమ్మ ఇప్పుడు మంచంలో ఉంది. నాన్న డైపర్లు మారుస్తూ అమ్మని చిన్నపిల్లలా చూసుకుంటున్నాడు. దానంతటికి కారణం నేనే.. నేను చేసిన తప్పు వల్ల ఇప్పుడు అమ్మ ఆ స్థితిలో ఉంది. తెలిసి తెలియని వయసులో ప్రేమ అంటూ రిలేషన్ పెట్టుకుని మోసపోయాను” అంటూ శ్రీ సత్య చెప్పుకొచ్చింది. గతంలోనూ ఈ విషయాన్ని శ్రీ సత్య చెప్పుకుంది.
“నేను రోజూ లేవగానే మా అమ్మ ముఖమే చూస్తాను. నేను జరిగిపోయిన దాని గురించి బాధ పడటం లేదు. కానీ, ఆ తప్పు వల్ల భవిష్యత్తు కూడా పాడైపోయింది. నేను ఆత్మహత్యకు కూడా యత్నించాను. అమ్మ స్థానంలో నేను ఉన్నా బాగుండేది. లేదంటే చనిపోయినా కూడా మా అమ్మ వాళ్ల ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు ఏడ్చేవాళ్లు. కానీ, నా వల్ల ఇప్పుడు జీవితాతం ఏడవడమే అవుతోంది. జీవితంలో నాకు ఒక పెద్ద పాఠం అది” అంటూ శ్రీ సత్య ఏడ్చేసింది. హౌస్మేట్స్ మొత్తం కలిసి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ, శ్రీ సత్య మాత్రం రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఆమె జీవితంలో చేసిన తప్పుకి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉంది. శ్రీ సత్య ఎమోషనల్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.