ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం ఎంతో గొప్పదని కితాబిచ్చారు. ప్రజా ప్రతినిధులు అనే వారు ఎల్లప్పుడూ ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. “కీప్ కాంటాక్ట్ విత్ ది పీపుల్. ఈ మధ్య గడప గడపకు ప్రభుత్వం అంటున్నారు ముఖ్యమంత్రి గారు సంతోషం. ఇంటి ఇంటికి వెళ్తున్నారు. వెళ్లాలి.. ఇంటి ఇంటికి వెళ్లాలి. ఎలక్షన్స్ అప్పుడు కాదు.. మాములు అప్పుడు వెళ్లాలి. వాళ్లను కలుసుకోవాలి, వాళ్లని కనుక్కోవాలి. వాళ్ల విషయాలు వినాలి. ఏం జరుగుతోంది.. పైన చెప్పిందే కింద జరుగుతోందా చూడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా అంతిమ ఫలితం అనేది ప్రధానం. చెప్పింది కింద వాడికి చేరిందా లేదా? అమ్మా నీకు వచ్చిందా? అక్కా నీకు వచ్చిందా? నీ చేతికి చేరిందా.. అని కనుక్కుని అది అందకపోతే వచ్చేలా చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది” అంటూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో దసరా సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్టులో విద్యా విజ్ఞానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. పిల్లలకు విద్యతో పాటుగా సంస్కృతి, సంప్రదాయాలను నేర్పుతున్నారని కొనియాడారు. వెంకయ్యనాయుడు రైతులు, పిల్లలు, పేదల కోసం శ్రమిస్తున్నారంటూ ఓం బిర్లా ప్రశంసించారు. ప్రజా సేవ లేని జీవితం వ్యర్థం అని వెంకయ్యనాయుడు అన్నారు. మనం సంపాదించే దానిలో కొంతభాగం అయినా సమాజానికి ఇవ్వడం అనేది జీవితంలో అందరికీ భాగం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమపై వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.