ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమం ద్వారా తాము సాధించిన ప్రగతి, అభివృద్ధి గురించి వెల్లడించారు. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే కూలిన గోడలు, కుంగిన పైకప్పులు, టీచర్ల కొరత, క్రీడా మైదానాలు లేకపోవడం, అరకొర సౌకర్యాలు.. ఇవే గుర్తొచ్చేవన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాఠశాలలు కొత్త బిల్డింగుల నుంచి డిజిటల్ లైబ్రరీల వరకు సకల సౌకర్యాలతో విలసిల్లుతున్నాయి. అందుకు కారణం ఒకే ఒక్క పథకం.. అదే ‘నాడు–నేడు’ అంటూ తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక బడుల దశ–దిశ మారిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నాటి రూపురేఖలు మారిపోయి– నేడు అందంగా ముస్తాబయ్యాయి అన్నారు. రూ.16 వేల కోట్లతో జగన్ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు స్కూళ్లను పటిష్ఠం చేస్తున్నాయని కొనియాడారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థనూ నాడు- నేడులో భాగం చేసింది. ఒక ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ను నియమించి.. పాలనా వ్యవహారాల్లో టీచర్లు, ఎంఈవోలకు సహకరించేలా బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఏఎన్ఎం, మహిళా పోలీసులకూ విధులను అప్పగించారు. పిల్లలుక ఏమైనా సమస్యలుంటే వాటిని తెలియజేసేందుకు ప్రత్యేక వెబ్సైట్, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా విద్యాశాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్నూ ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో సమస్యల గురించి తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 14417ను కూడా తీసుకొచ్చారు. స్కూళ్ల అభివృద్ధికి తరగతి గదులు, కొత్త భవనాలు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం వండేందుకు కిచెన్లు ఏర్పాటు చేసేందుకు నిధులను విడుదల చేస్తోంది. స్కూళ్లలో డ్రాపౌట్లు తగ్గేలా చూసేందుకు విద్యార్థులకు యూనిఫాంలు, బ్యాగులు, బూట్లు, సాక్సులు, పుస్తకాలను ఉచితంగా అందిస్తోంది. అమ్మ ఒడి కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10 వేలు కూడా జమచేస్తోంది.
విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్థుల ప్రతిభను క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ద్వారా అంచనా వేయనున్నట్లు తెలిపింది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఈ అసెస్మెంట్ విధానంలోనే పరీక్షలను నిర్వహించనుంది. అంతేకాకుండా బాల్యవివాహాలు, స్కూల్ డ్రాపౌట్లు తగ్గించడం, ఆడపిల్లలు చదువుకునేలా చేసేందుకు ఇటీవలే వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా పథకాలు పొందాలంటే పది పాసై ఉండాలని నిబంధన తీసుకొచ్చింది. స్కూల్ డ్రాపౌట్లను కనుగొనేందుకు కొత్తగా ఒక సర్వే కూడా నిర్వహిస్తోంది. ప్రస్తుతం అనంతపురంలో ఈ సర్వే చేస్తున్నారు. దసరా పండుగ అయ్యాక అసలు ఎంత మంది స్కూలు మానేశారన్నదానిపై స్పష్టత వస్తుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1098 కూడా ఏర్పాటు చేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి తెలియజేశారు.