గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను ఇప్పటం గ్రామస్తులకు భారీ జరిమానా విధించింది. ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టులో పిటిషన్ వేసిన 14 మందికి జరిమానా విధించింది. ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున 14 మందికి 14 లక్షలు జరిమానా విధిస్తూ కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో అక్రమ నిర్మాణాలను తొలగించమని తమకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని 14 మంది రైతులు కోర్టులో పిటిషన్ వేశారు. రైతుల పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం.. అధికారులు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది తెలపడంతో అక్రమ ఇళ్ల కూల్చివేతపై స్టే విధించింది.
అయితే అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఇళ్ళు కూల్చివేశామని.. ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో రైతులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నోటీసులు ఇచ్చినా.. ఇవ్వలేదని అబద్ధం చెప్పి కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంపై కోర్టు సీరియస్ అయ్యింది. తప్పుడు సమాచారం ఇచ్చి.. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు గాను 14 మంది రైతులను కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటం రైతులు ఇవాళ కోర్టులో హాజరయ్యారు. ఒక్కొక్కరూ లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.