ఒంటి శుభ్రత, ఇంటి శుభ్రత ఉంటే సరిపోదు.. పరిసరాల శుభ్రత కూడా ఉండాలి. ఒల్లు, ఇల్లు కాబట్టి ఎవరికి వారు శుభ్రం చేసుకుంటారు. కానీ వీధులని, రోడ్లని శుభ్రం చేయడం ప్రభుత్వ బాధ్యత. పన్నులు కట్టేది, పన్నుల ద్వారా జీతాలు ఇచ్చేది అందుకే కదా. తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో సరైన రోడ్డు మార్గం లేదని ఒక బాలుడు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. తమ కుటుంబానికి జరిగిన నష్టం.. ఇంకెవరికీ జరగకూడదని రోడ్డెక్కి నిరసన తెలిపాడు. రోడ్డు శుభ్రంగా లేకపోవడం వల్లే తన సోదరి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిందని ఆ బాలుడు ఆవేదనతో రోడ్డుపై బైఠాయించాడు. మీకు దండం పెడతా.. మా సమస్య పరిష్కరించండి అంటూ పదేళ్ల బాలుడు అధికారులను వేడుకున్న ఘటన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియాలోని ఎన్టీపీసీ గౌతమీ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీకి చెందిన కేశవ అనే పదేళ్ల బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే తమ కాలనీలో సరైన రోడ్డు మార్గం లేదని, రోడ్డు పరిశుభ్రంగా లేదని బాలుడు నిరసన బాట పట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ కాలనీలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగినా తొలగించేవారు లేక అవస్థలు పడుతున్నామని, దయచేసి పిచ్చి మొక్కలను తొలగించండి అంటూ బాలుడు అధికారులను వేడుకున్నాడు. బాలుడి సోదరి వేదశ్రీ రోజూ తెల్లవారుజామున నిద్ర లేచి రన్నింగ్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెను ఒక విష పురుగు కుట్టింది. దీంతో ఆమె అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలైంది.
అందుకే తన అక్క అనారోగ్యానికి కారణమైన రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపాడు. బల్దియా అధికారులకు నమస్కారం చేస్తూ రోడ్డు బాగు చేయవలసిందిగా కోరాడు. సరైన రోడ్డు మార్గం లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్డు బాగు చేయించాలని అధికారులను కోరాడు. కనీసం రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలనైనా తొలగిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశాడు. ఇది తన ఒక్కడి సమస్య మాత్రమే కాదని, కాలనీలో ఉన్న అందరూ ఇదే సమస్యను ఎదుర్కుంటున్నారని, దయచేసి మా గోడు వినమని బల్దియా అధికారులతో చెప్పుకున్నాడు.
పిచ్చి మొక్కల మధ్య విష పురుగులు ఆవాసం ఏర్పాటు చేసుకుని తమకు ప్రాణాపాయంగా మారుతున్నాయని, అధికారులు దయచేసి మొక్కలను తొలగిస్తే బాగుంటుందని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. శుభ్రంగా లేని పరిసరాల్లో విష పురుగులు, విష కీటకాలు ఆవాసం ఏర్పాటు చేసుకుని.. రోడ్డున వెళ్లే వారిని కుడుతున్నాయి. ఈ కారణంగా వారు అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే పెద్ద వాళ్ళు ఎవరూ చేయని పని ఈ కుర్రాడు చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కుర్రాడి మొర ఆలకించి అధికారులు చర్యలు చేపడతారో లేదో చూడాలి.
ఆ సమస్య తీర్చమని రోడ్డుపై కూర్చొని వేడుకుంటున్న బాలుడు..వైరల్ అవుతున్న న్యూస్.. #viralnews #protest https://t.co/jS5mFb9OQY
— News18 Telugu (@News18Telugu) October 19, 2022