ఆసియా కప్ 2022లో ఫ్లాప్ షో తర్వాత అక్టోబర్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2022కు సిద్ధమైంది టీమిండియా. అందుకోసం బీసీసీఐ సెలెక్టర్లు జట్టును కూడా ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో దాదాపు ఆసియా కప్ టీమ్నే టీ20 వరల్డ్ కప్కు పంపనున్నారు. ఈ టీమ్ లిస్ట్ను చూసిన తర్వాత ఇండియన్ క్రికెట్ అభిమానులు టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ టీమ్ కోసమా ఇన్ని రోజులు ప్రయోగాల పేరుతో జట్టును ఆగం చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రయోగాలు చేస్తున్నాం అని చెప్పి.. చివరికి ఈ టీమ్ను ఎంపిక చేశారంటూ మండిపడుతున్నారు. అసలు ఇన్ని రోజులు ప్రయోగాలు చేసిన ద్రవిడ్ ఏం సాధించారంటూ ప్రశ్నింస్తున్నారు. పైగా ఎన్నో ఆశలతో అంతర్జాతీయ కెరీర్ను మొదులపెట్టిన యువ క్రికెటర్లను టీ20 వరల్డ్ కప్ కోసం చేసిన ప్రయోగాలతో వారి కెరీర్ను నాశనం చేశారంటూ ఆరోపిస్తున్నారు.
రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు క్రికెట్ అభిమానులంతా ఎంతో సంతోషించారు. ఇక్కడి నుంచి టీమిండియా దశ తిరిగిపోతుందని, నెక్ట్స్ లెవెల్కు టీమ్ వెళ్లిపోతుందని భావించారు. కానీ.. రియాలిటీ వచ్చే సరికి పరిస్థితి వేరుగా ఉంది. టీమిండియా అండర్ 19 కోచ్గా మెరికల్లాంటి కుర్రాళ్లను ట్రైన్ చేసిన ద్రవిడ్ వారికి ఐపీఎల్ కోసమే శిక్షణ ఇచ్చినట్లు ఉంది. టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. 2022 అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ టీమిండియా ప్రధాన లక్ష్యమని ప్రకటించాడు. దాని కోసం ఇష్టమొచ్చినట్లు ప్రయోగాలు చేశాడు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు అయిన రోహిత్, రాహుల్, కోహ్లీ విషయంలో జోక్యం చేసుకోని ద్రవిడ్.. యువ క్రికెటర్లతో మాత్రం ఒక ఆట ఆడుకున్నాడు. ఏకంగా ఆరుగురిని ఓపెనర్లుగా ప్రయోగించాడు. ఇక బౌలింగ్ విభాగంతో అయితే చెడుగుడు ఆడుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2021 కోసం ప్రకటించిన జట్టును, ప్రస్తుతం ప్రకటించిన జట్టును ఒక సారి పరిశీలిస్తే.. పెద్దగా మార్పులు ఏమి కనిపించడం లేదు. కేవలం రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా మాత్రమే అప్పుడున్న జట్టులో ఉండి ఇప్పుడు లేరు. ఈ నలుగురు లేకపోవడం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్ టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ 2022లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత ఫామ్ను కూడా కోల్పోయారు. ఇక జడేజా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్లో చోటు కోల్పోయాడు. మరి వీరి స్థానంలో కొత్తగా జట్టులోకి వచ్చిన వారు ఎవరని పరిశీలస్తే.. దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. వీరి ఎంపిక ఏ క్రికెట్ అభిమానిని కూడా ఆశ్చర్యానికో, ఆనందానికో గురి చేయలేదు. మేం ముందే ఊహించామే భావనను కలిగించాయి. మొహమ్మద్ షమీ 2021 టీమ్లో ఉన్నా.. ఇప్పుడు స్టాండ్బై ప్లేయర్గా మాత్రమే ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత చిన్న చిన్న టీమ్స్పై విజయాలు తప్పించి టీమిండియా ప్రదర్శన ఏం అంత గొప్పగా లేదు.
టీ20 వరల్డ్ కప్ 2022 ప్రణాళికల్లో భాగంగా ద్రవిడ్ ఇష్టారీతిన చేసిన ప్రయోగాలతో జట్టులో ఎవరైనా కొత్తగా ప్లేయర్లు వచ్చారా అంటే అది లేదు. దినేష్ కార్తీక్ 2018లోనే నిధాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్పై టీమిండియాను గెలిపించి అద్భుత ఫినిషర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఆ విషయాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాడు. డీకే తన సొంత ప్రతిభ ఆధారంగా ఈ రోజు వరల్డ్ కప్ టీమ్లో స్థానం సంపాదించాడు కానీ.. ఇందులో ద్రవిడ్ చేసింది ఏం లేదు. ఇక అక్షర్ పటేల్ కూడా తన ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఎంపికయ్యాడు. చాహల్ విషయంలో కూడా ద్రవిడ్ చేసింది ఏం లేదు. మరి ద్రవిడ్ తన ప్రయోగాలతో సాధించింది ఏంటి? అని పరిశీలస్తే.. కేవలం కొంతమంది యువ క్రికెటర్ల కెరీర్లను ప్రమాదంలో పడేశాడు. ద్రవిడ్ అతి ప్రయోగాలతో సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ కెరీర్లు ప్రశ్నార్థకంగా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఐపీఎల్లో వేగంగా బౌలింగ్ వేశాడనే ఒకే ఒక కారణంతో టీ20 వరల్డ్ కప్ టీమ్ కోసం సిద్ధం చేయాలని హడావుడిగా జాతీయ జట్టులోకి తెచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో పరిస్థితిలపై సరైన అవగాహన, ట్రైనింగ్ లేకుండా కేవలం వేగం పేరుతో ఆడించి దారుణంగా ఫెయిల్ అయ్యారు. వేగాన్ని నమ్ముకున్న ఉమ్రాన్ అంతర్జాతీయ వేదికపై భారీ పరుగులు ఇచ్చుకుని విఫలం అయ్యాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్ ఎంత వేగం టీమ్లోకి వచ్చాడో.. డబుల్ స్పీడ్తో వెళ్లిపోయాడు. కోచ్ ద్రవిడ్ అతనికి కావాల్సిన టైమ్ ఇవ్వలేకపోయారు. మళ్లీ ఐపీఎల్లో సత్తా చాటితే కాని ఉమ్రాన్ను బ్లూ జెర్సీలో చూడలేం. ఇక ఆవేశ్ ఖాన్కు నటరాజన్, షమీని సైతం పక్కనపెట్టి భారీగా అవకాశాలు ఇచ్చారు. పలు సిరీస్లలో విఫలం అయినా ఆసియా కప్లో ఆడించి చేతులు కాల్చుకున్నారు. తీరా టీ20 వరల్డ్ కప్కు ముందు పక్కనపెట్టేశారు. దీంతో అతను ఇప్పట్లో టీమిండియాలోకి రావడం కష్టమే.
మోస్ట్ టాలెంటెడ్ సంజూ శాంసన్ను సరిగా వాడుకోలేదు. ఓపెనర్గా కూడా ప్రయోగాలు చేయించారు. ఐర్లాండ్ టీమ్స్పై రాణించి, ఆసియా కప్లో విఫలమైన దీపక్ హుడాను కొనసాగించారు. కానీ.. సంజూ శాంసన్కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. నిజానికి టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్లో దీపక్ హుడా కంటే కూడా శ్రేయస్ అయ్యర్ బెస్ట్ సెలెక్షన్ అయ్యేవాడు. దీపక్ హుడా ఆసియా కప్లో దారుణంగా విఫలం అయ్యాడు. ఆసియా కప్కు మొహమ్మద్ షమీ, శిఖర్ ధావన్ను ఎంపిక చేయకుండా తప్పు చేసిన సెలెక్టర్లు.. మరోసారి అదే తప్పు చేస్తున్నట్లు కనిపిస్తుంది.
డీకేను ఒక ఫినిషర్గా టీమ్లోకి తీసుకుని ఆ విషయాన్ని స్పష్టం చేయకుండా.. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు పోటీ అనే భావనను కలిగించారు. దీంతో పంత్ ఆత్మరక్షణలో తన ప్లేస్కు ఎక్కడ ముప్పువచ్చిపడుతుందో అని ఆందోళనతో ఫామ్ కోల్పోయాడు. పైగా పంత్ను ఓపెనర్గా ఆడించి తనపై తనకు మరింత అపనమ్మకం కలిగేలా చేశాడు. డీకేను టీ20 వరల్డ్ కప్లో పంత్ తర్వాత వికెట్ కీపర్తో పాటు ఫినిషర్గా ఎంపిక చేశారు. మరి ఇంత ఇంపార్టెంట్ ప్లేయర్కు ఆసియా కప్లో కచ్చితంగా గెలవాల్సిన కీలక మ్యాచ్ల్లో మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇలా పంత్ విఫలం అవ్వడం, డీకేను సరిగా ఉపయోగించుకోలేకపోవడం వెనుక ద్రవిడే ఉన్నాడు. ఓపెనర్ల విషయంలో అన్ని ప్రయోగాలు చేసి ద్రవిడ్ మళ్లీ సర్జరీ తర్వాత ఆసియా కప్లో చివరి మ్యాచ్ మినహా దారుణంగా విఫలం అవుతున్న కేఎల్ రాహుల్ వైపే మొగ్గుచూపాడు. ఈ మాత్రం దానికి అంతమంది ఓపెనర్లను ఎందుకు ప్రయోగించినట్లో అర్థం కాలేదు. ఇలా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రణాళికల్లో భాగంగా చేసిన ప్రయోగాలతో ద్రవిడ్ సాధించింది సున్నా. ఈ మాత్రం టీమ్ను సగటు క్రికెట్ అభిమాని కూడా ఊహించి ఉంటాడు. మరి టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఎంపిక చేసిన జట్టు, ద్రవిడ్ చేసిన ప్రయోగాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆసియా కప్ గెలవడంలో ధోనీదే కీలక పాత్ర! శ్రీలంక కెప్టెన్ చెప్పిన నిజాలు!
One title 🏆
One goal 🎯
Our squad 💪🏻#TeamIndia | #T20WorldCup pic.twitter.com/Dw9fWinHYQ— BCCI (@BCCI) September 12, 2022