క్రికెట్ మ్యాచ్ ను స్టేడియంలో చూస్తేనే మజా.. బ్యాట్స్ మెన్ ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే తోటి ప్రేక్షకులతో కలిసి ఈలలు కొడుతూ.. డ్యాన్స్ లు చేస్తూ.. మ్యాచ్ ను చూస్తే అది మనకు జీవితాంతం గుర్తుకు ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే టీమిండియా-సౌతాఫ్రికా ల మధ్య మెుదటి టీ20 మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఈ నెల 28న జరగనుంది. కానీ ఇప్పుడా మ్యాచ్ జరుగుతుందా?లేదా? అన్నది అనుమానంగా మారింది. దానికి కారణం ఏంటంటే? గ్రౌండ్ కు సంబంధించిన కరెంట్ బిల్లు, వాటర్ బిల్లును కేరళ స్పోర్ట్స్ అథారిటీ చెల్లించలేదు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు మైదానానికి కరెంట్ ను కట్ చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత్-సౌతాఫ్రికా మధ్య 3 టీ20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈ క్రమంలోనే మెుదటి టీ20 మ్యాచ్ కు కేరళ లోని తిరువనంతపురంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ మైదానం వేదిక కానుంది. ఈ నెల 28 న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఓ పిడుగులాంటి వార్త వెలుగులోకి వచ్చింది. గ్రీన్ ఫీల్డ్ మైదానం గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కరెంట్ బిల్లులు, నీటి బిల్లులు చెల్లించలేదట. దాంతో విద్యుత్ అధికారులు గ్రౌండ్ కు కరెంట్ సప్లైని ఆపేశారు అని అధికారి ఒకరు న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు తెలిపారు. గ్రౌండ్ కు సంబంధించిన సుమారు రూ.2.5 కోట్ల బిల్లు పెండింగ్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే మరికొన్ని రోజుల్లో మ్యాచ్ ఉండటంతో స్టేడియాం యాజమాన్యం ప్రస్తుతానికి జనరేటర్ తో తమ పనులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అదీ కాక సెక్యూరిటీకి సంబంధించిన మరిన్ని విషయాలపై కూడా బోర్డు ఆలోచిస్తోంది. గ్రౌండ్ కు వాటర్ ను సైతం నిలిపివేస్తున్నట్లు కేరళ వాటర్ అథారిటీ తెలిపింది. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది.
ఇక ఈ విషయం పై కేరళ క్రికెట్ అసోషియేషన్ కూడా స్పందించింది. ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ..”ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి మేం చింతిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని”అన్నారు. దీంతో భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు కరెంట్ బిల్లు కట్టకపోతే.. ఇంటికి, హోటల్ కి, ఇతర భవనాలకు కరెంట్ కట్ చేసిన సంఘటనలు మనం చాలానే చూశాం.. కానీ ఇలా.. బిల్లు కట్టలేదని స్టేడియానికే కరెంట్ కట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.