పండగకో లేదా మరేదైనా పని మీద ఊరు వెళ్దామని ముందుగానే చాలా మంది రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయాణం ఆగిపోవడం గానీ, వాయిదా పడడం గానీ జరుగుతుంది. ఇలాంటి సమయంలో టికెట్ వేస్ట్ అవుతుంది. ఛార్జీలు వేస్ట్ అవుతాయి. ఏ బస్సు టికెటో అయితే ఒకరి పేరు మీద ఇంకొకరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ట్రైన్ కి అలా ఉండదు. ఎవరి పేరు మీద ఉంటే వారు మాత్రమే ప్రయాణం చేయాలి. ప్రయాణం క్యాన్సిల్ అయితే టికెట్, ఛార్జీ డబ్బులు రెండూ పోయినట్టే. అప్పటికప్పుడు కాకపోయినా ముందుగానే బుక్ చేసుకున్న టికెట్ ని.. కొన్ని రోజుల క్రితం క్యాన్సిల్ చేసుకున్నా క్యాన్సిలేషన్ ఛార్జీలు పడతాయి.
ఒక రోజు ముందు చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఆ టికెట్ ని ఎవరికైనా ఇస్తే వారు ప్రయాణం చేయచ్చు. టికెట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీ ప్రయాణం వాయిదా పడితే.. మీ బదులు వేరే వ్యక్తిని పంపించవచ్చు. టికెట్ కన్ఫర్మ్ అయిన వారు తమ ప్రయాణం వాయిదా పడితే ఆ టికెట్ ని 24 గంటలోపు వేరే వారికి ట్రాన్స్ఫర్ చేసేలా భారతీయ రైల్వే కొత్త రూల్ ని అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలా మందికి దీని గురించి తెలియక టికెట్ ని వేస్ట్ చేసుకుంటారు. అయితే ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా మీ టికెట్ ని మరొకరికి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
కేవలం ఒకే ఇంటి పేరు ఉన్న కుటుంబ సభ్యులకి మాత్రమే టికెట్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కల్పిస్తుంది. దీని వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఏ తీర్ధయాత్రకో, వెకేషన్ కోసమో టికెట్ బుక్ చేసుకున్నాక.. కుదరకపోతే ఇంట్లో వారిని పంపించవచ్చు. ఊళ్ళో బంధువుల ఫంక్షన్ ఉండి.. ముందుగానే అన్నీ సెట్ చేసుకుని.. రెండు రోజుల ముందో, ఒక రోజు ముందో ప్రయాణం క్యాన్సిల్ అయితే.. తమ కుటుంబం నుంచి ఒకరైనా వెళ్లడం బాగోదు కాబట్టి ఒకరిని పంపించే అవకాశం ఉంటుంది. కానీ పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంటే.. ఆ టికెట్ ని ఇంట్లో వాళ్ళు ఏం చేసుకుంటారు అన్నది ప్రశ్న. ట్రాన్స్ఫర్ చేసినా వేస్టే. ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ప్రయాణం క్యాన్సిల్ అయిన సమయంలో అతని ప్లేస్ లో వేరే ఉద్యోగి ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తుంది.
విద్యార్థులది, ఎన్సీసీ క్యాండిడేట్స్ ది వేరే ముచ్చట. మరి ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. ఒక ఉద్యోగి ఆఫీస్ పని మీద వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ముందుగానే రైలు టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే.. ఏ కారణంగానో ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తన బదులు తన ఆఫీసులో పని చేసే వ్యక్తిని పంపించడానికి వీలవుతుందా? అంటే అవ్వదు. అలా అని కుటుంబ సభ్యులని ఎలా పంపిస్తాడు. ఏది ఏమైనా గానీ ఈ రూల్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రైల్వేస్టేషన్ కి వెళ్లి చేసుకోవడం కంటే కూడా ఆన్ లైన్ లో చేసుకునేలా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కుటుంబ సభ్యులకే కాకుండా ఇతరులకు కూడా టికెట్ ట్రాన్స్ఫర్ చేసేలా, ఆన్ లైన్ లో ట్రాన్స్ఫర్ చేసుకునేలా భారతీయ రైల్వే మార్పు తీసుకొస్తుందేమో చూడాలి.