అనుమానం.. ఓ పచ్చని కాపురంలో నిప్పులో పోసింది. అప్పటి వరకు సంతోషంగా సాగిన కాపురం ఒక్కసారిగా నిట్టనిలువనా కూలిపోయింది. ఇదే అనుమానంతో ఓ కసాయి భర్త కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని కాగల్ పట్టణంలో ప్రకాష్ బాలసో మాలి(42), గాయత్రి (37) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై ఇద్దరు పిల్లల సంతానం. భర్త ప్రకాష్ స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అయితే కొంత కాలం వరకు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. కానీ భర్తే కొన్నాళ్లకి రాక్షసుడిలా మారాడు. గత కొన్ని రోజుల నుంచి ప్రకాష్ భార్య గాయత్రిని అనుమానంతో వేధిస్తుండేవాడు. రోజూ రాత్రుళ్లు భార్యను కొడుతూ తిడుతూ తీవ్ర హింసకు గురి చేసేవాడు.
బుధవారం భర్త ప్రకాష్ భార్య గాయత్రిని.. నీకు మరో మగాడితో పరిచయాలున్నాయంటూ గొడవ పడ్డాడు. ఇదే గొడవ చివరికి చినిగి చినిగి గాలి వానలా తయారైంది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన భర్త భార్య గాయత్రితో పాటు తన ఇద్దరు పిల్లలను దారుణంగా హతమర్చాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.