బీహార్ రాజధాని పాట్నాలోని మసౌధి పరిధిలోని చాపౌర్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మాహ్తోకి సోనూ బీహార్ అనే 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ కుర్రాడు మూడో తరగతి చదువుతున్నాడు. చదివేది మూడో తరగతే అయినా పదో తరగతి విద్యార్థులకి లెక్కల పాఠాలు నేర్పుతున్నాడు. చూస్తుంటే శ్రీనివాస్ రామానుజన్ కథలా అనిపిస్తుంది కదూ. శ్రీనివాస్ రామానుజన్ కూడా తన బాల్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి లెక్కల్లో సందేహాలు ఉంటే సాల్వ్ చేసేవారు. అలానే ఇప్పుడు ఈ బుడ్డోడు కూడా పదో తరగతి విద్యార్థులకి లెక్కల్లో డౌట్లు ఉంటే ఇట్టే తీర్చేస్తున్నాడు. మార్కర్ పట్టుకుని వైట్ బోర్డు మీద మ్యాథ్స్ సబ్జెక్టు డీల్ చేస్తూ మ్యాథ్స్ గురువుగా ఫేమస్ అయిపోయాడు.
రాజ్ కుమార్ వృత్తి రీత్యా టీచర్ కావడంతో కొడుకు మీద ఆ లెక్కల ప్రభావం పడిందేమో. ఏకంగా పదవ తరగతికి సంబంధించిన సూత్రాలను అప్పజెప్పి.. లెక్కలను పరిష్కరిస్తున్నాడు. టీచర్లు అడిగే ప్రతీ సూత్రాన్ని టక్కున చెప్పేస్తున్నాడు. సోనూ ప్రతిభకు టీచర్లే అవాక్కవుతున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర ఉండడం వల్ల ఈ బాలుడు లెక్కల్లో కింగ్ అయ్యాడని అభిప్రాయపడుతున్నారు. సోనూ తండ్రి ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్ చెబుతుంటాడు. అయితే ట్యూషన్ కి వచ్చే పదో తరగతి విద్యార్థులు లెక్కల్లో ఏ సందేహం వచ్చినా సోనూనే అడుగుతారు. సోనూ చెప్పే విధానం చాలా ఆసక్తిగా ఉంటుందని, తమ టీచర్ల కంటే గొప్పగా, అర్ధమయ్యేలా వివరిస్తాడని విద్యార్థులు చెబుతున్నారు.
హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు చాలా మంది సోనూ దగ్గరకే వెళ్లి లెక్కల్లో తమ సందేహాలను తీర్చుకుంటారు. ఈ జూనియర్ శ్రీనివాస్ రామానుజన్ గురించి ఆ నోటా ఈ నోటా మౌత్ పబ్లిసిటీతో ఫేమస్ అయిపోయాడు. స్థానికులు లెక్కల మాంత్రికుడు, చోటే ఖాన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లి రామానుజన్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సోనూ ప్రతిభకి స్టన్ అవుతున్నారు. శ్రీనివాస్ రామానుజన్ ఈ బాలుడి రూపంలో మళ్ళీ పుట్టారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.