నువ్వే నువ్వే.. టాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ చాలా కొద్ది సినిమాలే ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో డైరెక్టర్గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేసిన తొలి సినిమా నువ్వే నువ్వే కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా బృందం ఒక ఈవెంట్ నిర్వహించారు. సినిమాకి పనిచేసిన అందరూ ఈవెంట్లో పాల్గొని మరోసారి అలనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10, 2002న విడుదలైంది. ఈ సినిమాలో తరుణ్- శ్రియ, ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సునీల్, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
మాటల మాంత్రికుడిలో డైరెక్షన్ అనే యాంగిల్ని పరిచయం చేసింది ఈ చిత్రం. ఈ సినిమాలోని పాటలు, మాటలు ఒకటేమిటీ అన్నీ ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. “నువ్వేకావాలి సినిమా వనమాలి గెస్ట్ హౌస్లో చేస్తున్నాం. దానికి పక్కనే కాస్త ఖాళీ స్థలం ఉంది. అక్కడ త్రివిక్రమ్ నాకు నువ్వే నువ్వే కథ చెప్పాడు. త్రివిక్రమ్ కథ పూర్తి చేయడానికి గంటన్నర పట్టింది. ఆ గంటన్నరసేపు మేము నడక ఆపలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ మరో కథ కూడా చెప్పాడు. రెండింటిలో ఏదైనా నాకు ఓకే అని చెప్పాను. నువ్వు నువ్వే కథ ఫైనల్ చేసుకున్నాం. నువ్వేకావాలి సినిమా విడుదల తర్వాత త్రివిక్రమ్ స్టార్ రైటర్ అయిపోయాడు. అతనికి అవకాశం ఇస్తామంటూ ఎన్నో బ్యానర్లు ఎగబడ్డాయి. కానీ, త్రివిక్రమ్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం మాతోనే తన తొలి సినిమా చేశాడు” అంటూ రవికిశోర్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా గురించి తరుణ్ కూడా స్పందించాడు.. “త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా డెబ్యూ సినిమాకి ఆయన మాటలు రాశారు.. ఆయన డెబ్యూ సినిమాకి నేను హీరోగా చేశాను. ఆయన ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలే చేశారు, చేస్తుంటారు. కానీ, ఆయన డెబ్యూ సినిమాకి హీరోగా చేసింది నేనే అని గర్వంగా చెప్పుకుంటాను” అంటూ త్రివిక్రమ్ గురించి తరుణ్ చెప్పుకొచ్చాడు. తరుణ్ మాట్లాడుతున్న సమయంలో త్రివిక్రమ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. కళ్లజోడు తీసి కళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. అయితే త్రివిక్రమ్కి డైరెక్టర్గా ఎన్ని హిట్లు వచ్చినా కూడా.. తన మొదటి సినిమా విజయం గురించి మరోసారి గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైనట్లు కనిపించాడు. మరోసారి నువ్వే నువ్వే చిత్ర బృందం ఇలా అందరి ముందుకు వచ్చి తమ అనుభవాలను, తమ జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకోవడం బావుందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.