మంచు విష్ణు.. మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘మా’కు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవేంటంటే.. కనీసం రెండు సినిమాల్లో నటించి అవి రిలీజ్ అయిన తర్వాతే శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని, ఏదైనా ఒక సినిమాలో 5 నిమిషాలైనా కనిపించి డైలాగ్ చెప్పిన వారికి అసోసియేట్గా సభ్యత్వం కల్పిస్తామని చెప్పారు. మెంబర్గా నమోదు అయిన ఐదేళ్ల తర్వాత మాత్రమే ఓటు హక్కు లభిస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా ‘మా’ విషయంలో మీడియా ముందుకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా, విమర్శలు చేసినా, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా క్రమశిక్షణ చర్యల కింది వారి సభ్యత్వం రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.
ఈ నిర్ణయాలకు సంబంధించి మంచు విష్ణుని ప్రశ్నించగా.. “ఎవరైనా మా గురించి వ్యక్తిగతంగా తప్పుగా మాట్లాడచ్చు గానీ.. ‘మా’ కుటుంబం గురించి, కళామ్మతల్లి గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వెంటనే సభ్యత్వం నుంచి తీసేస్తాం. ఐదేళ్ల లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఉంటేనే ఓటు హక్కు వస్తుంది. ఇప్పుడు 900 మంది సభ్యులు ఉన్నారు. నా టర్మ్ అయ్యేలోపు ఇంకా 300 మంది చేరుతారు. అందరికీ సౌకర్యాలు కల్పిస్తాం. కానీ, ఓటు మాత్రం ఐదేళ్ల తర్వాతే వస్తుంది” అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. వాక్ స్వాతంత్ర్యం హరించినట్లే కదా మీ నిర్ణయం అని ప్రశ్నించగా.. “మీ ఇంట్లో గొడవ జరిగితే పెద్దలకు చెప్తారా? లేక రోడ్డు మీదకు వచ్చి మీడియా కవరేజీ కోసం గోల చేస్తారా?” అంటూ విష్ణు ప్రశ్నించాడు.
“మీ ఇంట్లో సమస్య ఏదైనా ఉండి.. అది తీరనప్పుడు మీ పెద్దల వద్దకు వెళ్తారు. మీడియా ముందు కావాలని పబ్లిసిటీ కోసం గోల చేస్తే మంచిదా? కాదు కదా. అందుకే ఇండస్ట్రీలో పెద్దలను డీఆర్సీ కమిటీలో పెట్టాం. నాన్న గారు, బాలకృష్ణ గారు, గిరిబాబు గారు, శివకృష్ణ గారు, జయప్రదగారు, అన్నపూర్ణగారు.. మేము అనింది కరెక్ట్ కాదని అన్నప్పుడు మేము సైలెంట్ అయిపోతాం. నేను 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు. మేమంతా ఒక కుటుంబం. చేతికి ఉన్న ఐదువేళ్లు ఎలా అయితే ఒకేలా ఉండవు, ఒక కుటుంబంలో అందరూ సక్రమంగా ఉండరు. తప్పుదారి ఎంచుకున్న వారికి హెచ్చరికగా రూల్స్ మార్చాం” అంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించాడు.