ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి అందరికి తెలిసిందే. ఇంకా రాష్ట్రంలోని పలు ప్రాంతాలో వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చెరువులుగా మారాయి. గోదావరితో సహా పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వరద తీవ్ర కొంత తగ్గింది. అయితే హైదరాబాద్ లో మాత్రం వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మూసీ నది గత ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ వంతెన పై నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అంతే కాక చాదర్ ఘాట్ వంతెనను సైతం ఈ వరద నీరు తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో ఆ రెండు వంతెనలపై నుంచి రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
దీంతో అటుగా వెళ్తున్న వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంబర్ పేట , గోల్నాక మార్గాల్లో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. మూసీ నది ఉగ్రరూపంతో.. ఆ పరిసర ప్రాంతాల్లోని చాలా కాలనీలను వరద నీరు ముంచెత్తింది. వికారాబాద్, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని వదలుతున్నారు. దీంతో మూసీ నదిలోకి వరద ప్రవాహం పోటెత్తింది. మూసారాంబాగ్, చాదర్ఘాట్ ప్రాంతాల్లో ప్రమాదరకరంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.