ఆపదలో ఉన్నవారి గురించి తెలిస్తే.. ప్రతి ఒక్కరు సానుభూతి చూపుతారు. మరి కొందరు పెద్ద మనసు చేసుకుని సాయం చేసి అండగా నిలబడతారు. అయితే మనం చేసే ప్రతి సాయానికి సార్థకత ఉంటుందా అంటే చెప్పలేం. అది సాయం పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి చేసిన సాయం బూడిదలో పోసిన పన్నీరుగా మారితే.. మరి కొందరు మాత్రం తమకు సాయం చేసిన వారి పేరు నిలబెట్టేలా జీవితంలో ఎదిగి చూపిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అది కూడా ఎవరో సామాన్య వ్యక్తికి కాదు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్కి ఇప్పుడు ఇదే అనుభవం ఎదురయ్యింది.
కొన్నేళ్ల క్రితం ఓ అనాథ యువతి చదువుకునేందుకు సాయం చేసి అండగా నిలిచారు కేటీఆర్. ఆమె చదువు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును భరించారు. ఇక ఆ విద్యార్థి కూడా అంతే పట్టుదలతో చదివి.. నేడు ఏకంగా 5 బహుళ జాతీయ కంపెనీల్లో(MNC)ల నుంచి జాబ్ ఆఫర్స్ అందుకుంది. ఈ విషయం తెలిసి కేటీఆర్ సదరు యువతని ప్రశంసించారు. ఆ వివరాలు..
జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన రుద్ర భూమేశ్వర్, మమతల కూతురు రచన. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో జగిత్యాలలో బాలల సదనంలో పదో తరగతి వరకు చదివింది. అప్పటి కలెక్టర్ శరత్ సహకారంతో హైదరాబాద్లోని యూసుఫ్గూడలో డిప్లొమా చదివి ఈ-సెట్లో మంచి ర్యాంక్ సాధించింది. అక్కడి నుంచి వచ్చి కథలాపూర్ మండలం తాండ్య్రాలలోని తన అక్క రమ్య ఇంట్లో రచన ఉంటున్నది. రచన ఈసెట్లో మంచి ర్యాంక్ సాధించిన విషయాన్ని ఆమె బావ శేఖర్ ట్విట్టర్లో పోస్టు చేయగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. రచనను దత్తత తీసుకొని తన సొంత డబ్బుతో బీటెక్ చదివించారు. పట్టుదలతో కష్టపడి చదివిన రచన.. ఐదు బహుళజాతి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్ లెటర్లు అందుకున్నది.
రచన విజయాలను కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఈ వార్త నా మనసుకు హత్తుకుంది. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న విద్యార్థిని రచన.. మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతోందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇది చూసిన వారు కేటీఆర్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలానే రచనకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This news warmed my heart & made my day 😊
This bright young girl Rachana is going to soar to much greater heights 👍 pic.twitter.com/VFjRtWCkwq
— KTR (@KTRTRS) July 26, 2022