ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు గిత్తలకు మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అంతటి పేరు, గుర్తింపును సాధించినవి పుంగనూరు ఆవులని చెప్పొచ్చు. ఈ ఆవు జాతి మొత్తం చిత్తూరు జిల్లాకే దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెనాలిలో ఓ పుంగనూరు ఆవు దేశవ్యాప్తంగా మరోసారి వాటి జాతి పేరు మారుమ్రోగేలా చేసింది.
పొట్టిగా మూడడుగుల ఎత్తులో చూడగానే ఆకట్టుకునేలా ఉండే ఈ ఆవులను.. పాలు తక్కువ ఇస్తాయనే కారణంతో మొదట్లో అశ్రద్ధ చేశారు. కానీ, ప్రస్తుతం ఈ జాతి ఆవులు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొందరు అపార్టుమెంట్లలో సైతం ఈ ఆవులను పెంచుకోవడం చూస్తున్నాం. ఇవి గరిష్టంగా 3 అడుగుల వరకు మాత్రమే పెరుగుతాయి.
విశాలమైన నుదురు, చిన్ని కొమ్ములతో చూడగానే ముద్దుగా ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా బూడిద, తెలుపు రంగులో ఉంటాయి. మామూలు ఆవులతో పోలిస్తే వీటి పాలు చిక్కగా వెన్న శాతం కూడా ఎక్కువగా ఉంటాయి. సాధరణ ఆవు పాలల్లో 3 శాతం వెన్న ఉంటే ఈ పుంగనూరు ఆవు పాలల్లో 6.5 శాతం వరకు వెన్న ఉంటుంది. అంతేకాదు వీటి పాలు సుగంధ వాసనలతో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు.
తాజాగా తెనాలిలో ఓ పుంగనూరు ఆవును అక్షరాలా రూ.4.10 లక్షలకు కొనుగోలు చేశారు. హరిద్వార్ నుంచి వచ్చిన బాబా రామ్ దేవ్ ఆశ్రమ ప్రతినిధులు కొన్నట్లు చెబుతున్నారు. ఈ పుంగనూరు ఆవులు ప్రస్తుతం ఒక్కోటి రూ.3 లక్షల నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. వాటి ఆకారం, ఆహార్యాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. పుంగనూరు ఆవు రూ.4.10 లక్షలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.