తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్గా ఉంటారు. విపక్షాలుపై విమర్శలు చేయడం.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటారు కేటీఆర్. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. సాయం కోసం అభ్యర్థించే వారిని ఆదుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రతిభ ఉండి అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక బాధపడేవారికి సాయం చేయడంలో ముందుంటారు. అలా కేటీఆర్ సాయం పొందిన ఓ అనాధ యువతి.. ఆయన పేరు నిలబెట్టడమే కాక.. కేటీఆర్ను అన్నలా భావించి.. ఆయనకు రాఖీ కట్టింది. యువతి చేసిన పనితో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ఆ విషయాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే మృతి చెందారు. ఆదరించే వారు ఎవరు లేకపోవడంతో.. రచన స్థానిక బాలసదనంలో చేరి.. జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని స్టేట్ హోమ్లో ఉంటూ పాలిటెక్నిక్ని పూర్తి చేసింది. ఇక ఈసెట్ ఎంట్రెన్స్లో మంచి ర్యాంక్ సాధించింది. దాంతో ఆమెకు సీబీఐటీ కాలేజీలో సీటు వచ్చింది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో చేరింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల మృతితో అనాధ అయిన రచన.. ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు చెల్లించలేకపోయింది. రచన సమస్య గురించి వివరిస్తూ.. ఆమెను ఆదుకోవాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ను కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. రచనను ప్రగతి భవన్ పిలిపించి.. ఆమెతో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని రచనకు కేటీఆర్ హామీ ఇచ్చారు
ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ వ్యక్తిగతంగా సమకూర్చారు. ఇక రచన కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చదువులో రాణించింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 4 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భంగా రుద్ర రచన ప్రగతి భవన్ వెళ్లి కేటీఆర్ను కలిసింది. ఆమె చదువు, ఉద్యోగాల విషయం తెలుసుకుని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తనవారంటూ ఎవరూ లేకపోయినా ఆత్మ విశ్వాసంతో రుద్ర రచన జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు.
ఇక తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్ ఒక అన్నగా అండగా నిలబడ్డారని, తన కలల సాకారం కోసం తండ్రిగా తపించారని రచన భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా తాను దాచుకున్న డబ్బుతో ప్రత్యేకంగా తయారుచేయించిన వెండి రాఖీని కేటీఆర్కు కట్టింది. రచన మాటలు, అభిమానానికి ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రచన చేత రాఖీ కట్టించుకున్న కేటీఆర్ ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు తాను నిత్యం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని.. వాటిని సవాలుగా స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగి.. నేడు ఏకంగా నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన రచన యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్.
భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్న తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అలానే లాస్ట్ ఇయర్ ఇంజినీరింగ్, హాస్టల్ ఫీజ్ కోసం అవసరమైన మొత్తం నగదు సాయాన్ని ఈ సందర్భంగా రచనకు అందజేశారు మంత్రి కేటీఆర్. పేదింటి బిడ్డను ఆదుకున్న కేటీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nothing more gratifying than seeing someone you assisted come back to you after they’ve fulfilled their dreams 😊
Rachana came after graduating with 4 job offers!! Cognizant, Wipro among the offers she received
Congratulated her & wished her the best in her future pursuits pic.twitter.com/1os9vwjSgd
— KTR (@KTRTRS) September 19, 2022