ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన ఎనిమిది ఓవర్ల షార్ట్ అండ్ సూపర్ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిన భారత్.. నాగ్పూర్లో జరిగిన రెండో మ్యాచ్లో సూపర్ విక్టరీ సాధించి.. సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో ఆదివారం హైదరాబాద్లో జరగబోయే చివరి మ్యాచ్ సిరీస్ డిసైడింగ్ మ్యాచ్గా మారింది. శుక్రవారం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆట చాలా ఆలస్యంగా మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 31), మ్యాథ్యూ వేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 43 నాటౌట్) చెలరేగడంతో ఆసీస్ టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేట్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించారు. హర్షల్ పటేల్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ 2, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. కేవలం 8 ఓవర్లలోనే 91 పరుగులు చేయాల్సి దశలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్ నుంచే ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టీ20ల్లో టాప్ బౌలర్ అయిన జోస్ హెజల్వుడ్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ రెండు సిక్స్లు, కేఎల్ రాహుల్ ఒక సిక్స్ బాది టీమిండియా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ అదే జోరును కొనసాగించగా.. వేగంగా ఆడే క్రమంలో రాహుల్ 10 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా రెండు బౌండరీలతో ఎదురుదాటికి దిగి.. జంపా బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా(9) కూడా వెంటనే అవుట్ అయ్యాడు.
ఒక వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులతో మ్యాచ్ను టీమిండియా చేతుల్లో పెట్టాడు. ఇక చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన దశలో క్రీజ్లోకి వచ్చిన మిస్టర్ ఫినిషర్ దినేష్ కార్తీక్.. మ్యాచ్కు సూపర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. తను ఎదుర్కొన్న రెండు బంతుల్లోనే 6, 4తో మ్యాచ్ను మరో నాలుగు బంతులు ఉండగానే ముగించాడు. దీంతో మరోసారి తన ఫినిషర్ రోల్కు న్యాయం చేశాడు. తొలి మ్యాచ్ ఓటమితో తీవ్ర నిరాశ చెందిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విజయంతో అమితానందంగా కనిపించాడు. విజయానికి కావాల్సిన పరుగుల్లో సగం తానే కొట్టినా.. డీకే ఇచ్చిన ఫినిషింగ్ టచ్కు రోహిత్ సైతం ఫిదా అయ్యాడు.
బౌండరీతో మ్యాచ్ను గెలిపించిన డీకేను గుండెలకు హత్తుకుని అభినందిస్తూ.. విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా.. తొలి మ్యాచ్లో వికెట్ కోసం డీకే సరిగా అప్పీల్ చేయడం లేదంటూ.. సరదాగా అతని గొంతు పట్టుకున్న రోహిత్.. ఇప్పుడు అదే డీకేను గుండెలకు హత్తుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రోహిత్ డీకే గొంతు పట్టుకున్న ఫొటో.. ఈ మ్యాచ్లో హగ్ చేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఇంతలో ఎంత మార్పు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా.. డీకే, రోహిత్ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ దాదాపు ఒకే సారి కెరీర్ స్టార్ట్ చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
how it started how it’s going
Dinesh Karthik x Rohit Sharma#DineshKarthik #RohitSharma𓃵 #INDvsAUST20I
pic.twitter.com/gATMOPaCP3— ꧁ℱ࿆ⷨ💥MasterMohan VFC💥ℱ࿆ⷨ꧂ (@JosephVijayyy) September 23, 2022
What a start of Weekend..💤#INDvsAUST20I #RohitSharma𓃵 #DineshKarthik #Hitman
🎥- @BCCI pic.twitter.com/5YIEdB1gOT— Pranit (@PSavgave) September 23, 2022
ఇది కూడా చదవండి: అయ్య బాబోయ్.. ధోనిలా రోహిత్ కూల్ కాదు! గ్రౌండ్ లోనే బూతులు!