ప్రపంచ క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డు. వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తొలి డబుల్ సెంచరీతోనే క్రికెట్ లోకం నివ్వెరపోయింది. అలాంటిది ఏకంగా ఒక వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులు కొట్టిపడేశాడు. కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సులతో 264 పరుగులు. అప్పటి వరకు అది ఒక జట్టు మొత్తం కలిపి కొట్టేంత స్కోర్. కానీ.. హిట్ మ్యాన్ ఒక్కడే బాదాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2014 నవంబర్ 13న కోల్కత్తా వేదికగా శ్రీలంకపై రోహిత్ శర్మ ఈ విధ్వంసం సృష్టించాడు. కలలో సైతం ఏ క్రికెటర్ ఊహించని ఇన్నింగ్స్ అది. ప్రపంచ క్రికెట్పై రోహిత్ ముద్రను బలంగా వేసిన ఇన్నింగ్స్. దాదాపు 8 ఏళ్లు అవుతున్నా.. వన్డే చరిత్రలో అదే నంబర్ వన్ ఇన్నింగ్స్. ఇలాంటి ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ను ఆడిన రోహిత్ శర్మను ఎంత మెచ్చుకున్నా.. ఆకాశానికెత్తినా తక్కువే. అలాగే రోహిత్ను ఆ గొప్ప ఇన్నింగ్స్ ఆడేందుకు మరో విధ్వంసకర ఆటగాడు చూపిన నిస్వార్థం కూడా రోహిత్ రికార్డు ఇన్నింగ్స్కు కారణం. అతనే టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప.
శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా అజింక్యా రహానే, రోహిత్ శర్మ వచ్చారు. 28 పరుగులు చేసిన రహానే 8వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అంబటి రాయుడు(8) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 66 పరుగులు చేసి ఇన్నింగ్స్ 39వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే సురేష్ రైనా(11) సైతం పెవిలియన్ చేరాడు. రైనా అవుట్ తర్వాత రాబిన్ ఊతప్ప క్రీజ్లోకి వచ్చాడు. కానీ అప్పటికే ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకుని 155 పరుగులతో జోరు మీద ఉన్నాడు. రోహిత్ శర్మ చూపిస్తున్న స్పీడ్ను, అతను ఏదో అద్భుతం చేయబోతున్నాడనే విషయాన్ని పసిగట్టిన ఊతప్ప తాను ఏం చేయాలో ఫిక్స్ అయిపోయాడు.
ఊతప్ప కూడా రోహిత్ శర్మ రేంజ్లో హిట్టింగ్ చేయగల ఆటగాడు. పైగా 41వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చాడు. అప్పటి వరకు ఉన్న టెంపోను కొనసాగిస్తూ.. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై తాను కూడా చకచకా ఒక హాఫ్ సెంచరీ చేసి తన ఖాతాలో వేసుకోవచ్చు. కానీ.. రాబిన్ అలా చేయలేదు. ఎంతో నిస్వార్థంగా రోహిత్ శర్మకు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. ఊతప్ప క్రీజ్లోకి వచ్చినప్పుడు రోహిత్ స్కోర్ 155.. 50 ఓవర్లు ముగిసే సరికి రోహిత్ స్కోర్ 264, కానీ.. రాబిన్ ఊతప్ప మాత్రం 16 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. భారీ షాట్లు ఆడే ఎబిలిటీ ఉన్నా.. ఏదో సాధించబోతున్నాడని రోహిత్ను నమ్మి.. తనకు స్ట్రైక్ వచ్చిన ప్రతిసారీ.. సింగిల్ తీసి రోహిత్కు బ్యాటింగ్ ఇచ్చాడు. వీలైనన్ని ఎక్కువ బంతులు రోహిత్ ఆడాడు అంటే అందుకు కారణం ఊతప్ప నిస్వార్థమే. రోహిత్ శర్మ 264 పరుగుల భారీ స్కోర్ సాధించి, వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును కలిగి ఉన్నాడంటే అందుకు కారణం ఊతప్ప.
రోహిత్ శర్మ 264 రికార్డుకు అంత నిస్వార్థంగా సహాయం చేసిన ఊతప్ప బుధవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో అద్భుత బ్యాటింగ్తో ఊతప్ప టీమిండియాలో కీ ప్లేయర్గా ఎదిగాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. మళ్లీ తిరిగి కొన్ని రోజులకు జట్టులోకి వచ్చినా.. సుస్థిర స్థానం మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఐపీఎల్లో చాలా జట్లకే ఆడాడు. ముఖ్యంగా ఆర్సీబీ, కేకేఆర్, చెన్నై జట్ల తరఫున మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. ఊతప్ప తన కెరీర్లో మొత్తం 46 వన్డేలు ఆడి 934 పరుగులు చేశాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అలాగే 13 అంతర్జాతీయ టీ20ల్లో 249 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 142 మ్యాచ్ల్లో 9446 పరుగులు ఉన్నాయి. అందులో 22 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే లిస్ట్ ఏ లో 203 మ్యాచ్లు ఆడి 6534 పరుగులు చేశాడు. అందులో 16 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో 205 మ్యాచ్లు ఆడిన ఊతప్ప 197 ఇన్నింగ్స్ల్లో 4952 పరుగులు చేశాడు. అందులో 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో ఊతప్ప అత్యధిక స్కోర్ 88. ఐపీఎల్లో ఊతప్ప 481 ఫోర్లు, 182 సిక్సులు బాదాడు. మరి రోహిత్ శర్మ 264 రికార్డు ఇన్నింగ్స్కు రాబిన్ ఊతప్ప అందించిన సపోర్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పదేళ్లకే మూర్చ వ్యాధి.. స్టెరాయిడ్స్ తో అధిక బరువు.. ఊతప్ప ప్రస్థానం!