ఇండియన్ క్రికెట్ను కొన్ని ఏళ్లపాటు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని శాసించాడు. తన హయాంలో చాలా మంది యువ క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వారిలో కొంతమంది స్టార్లుగా కూడా ఎదిగారు. ముఖ్యంగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన చాలా మంది యువ క్రికెటర్లు త్వరగా టీమిండియాకు ఎంపికయ్యారు. కానీ.. తనకు అలాంటి అవకాశం రాలేదని, నిజానికి ధోని తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే టీమిండియాకు ఆడి ఈ రోజు నేను వేరే లెవెల్లో ఉండే వాడినంటూ ఇటివల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈశ్వర్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2007లో క్రికెట్ కెరీర్ మొదలుపెట్టిన పాండే.. తొలుత మధ్యప్రదేశ్ అండర్ 19 టీమ్కు ఆడాడు. అక్కడ మంచి ప్రదర్శన కనబర్చడంతో రంజీల్లో ఆడే అవకాశం వచ్చింది. 2013-14 రంజీ సీజన్లో ఈశ్వర్ పాండే టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు.
రంజీల్లో పాండే చూపించిన ప్రదర్శనకు ఐపీఎల్ టీమ్ పుణె వారియర్స్ ఇండియా పాండేను నెట్ బౌలర్గా తీసుకుంది. ఆ తర్వాతి ఏడాది రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ పాండేను కొనుగోలు చేసింది. ఇలా పాండే ఐపీఎల్ ప్రస్థానం ప్రారంభమైంది. రైజింగ్ పుణె నుంచి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్కు మారిన పాండే సీఎస్కే తరఫున 20కి పైగా మ్యాచ్లు ఆడాడు. మొత్తం 25 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన పాండే 18 వికెట్లు పడగొట్టాడు. 2015 తర్వాత ఐపీఎల్కు దూరమైన పాండే దేశవాళీ క్రికెట్ ఆడుతూ.. ఇటివల ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నాకు 23-24 ఏళ్ల ఉన్నప్పుడు మంచి ఫిట్నెస్తో ఉన్నాను. ఆ టైమ్లో ధోని నాకు ఒక్క అవకాశం ఇచ్చిఉంటే టీమిండియాకు ఆడి, మంచి ప్రదర్శన చేసి ఈ రోజు ఒక మంచి స్థాయిలో ఉండే వాడిని.’ అన్నాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్రకటనలోనూ ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ‘టీమిండియా తరఫున ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్లు ఆడేందుకు వెళ్లడం నాకెంతో గర్వకారణం. కానీ.. తుది జట్టులో స్థానం దక్కకపోవడం మాత్రం ఎంతో బాధకలిగించింది. అది నన్ను ఒక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్గా మిగిల్చింది. కానీ.. విరాట్ కోహ్లీ, ధోని, యువరాజ్, సురేష్ రైనా, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ లాంటి ఈ తరం గొప్ప క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నాకెంతో ప్రత్యేకం.
అలాగే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో కలిసి ఆడటంతో నా కల నిజమైంది. సచిన్ను ఆటను చూస్తూ పెరిగాను. చిన్నతనం నుంచి అతన్నే ఆరాధించాను. అలాగే తనకు ఐపీఎల్ లాంటి ప్రపంచలోనే నంబర్ వన్ టీ20 లీగ్లో ఆడే అవకాశం కల్పించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్కు ధన్యవాదాలు. ధోని సారథ్యంలో ఆడటం, 2014లో ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన జట్టులో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా సుదీర్ఘ కెరీర్కు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, మధ్యప్రదేశ్ క్రికెట్ బోర్డుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా కుటుంబం నాకు అందించిన సహకారానికి థ్యాంక్స్’ అంటూ ఈశ్వర్ పాండే ఎమోషనల్ పోస్టు చేశాడు. మరి పాండేకు ధోని అవకాశం ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కోహ్లీని రిటైర్ అవ్వాలన్న అఫ్రిదీని దారుణంగా ట్రోల్ చేసిన అమిత్ మిశ్రా