పరిశ్రమలు, మౌళిక సదుపాయాల కల్పనపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, పాఠశాలలకు డిసెంబరు కల్లా 100 శాతం ఇంటర్నెట్ సదుపాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలకు 5జీ సేవలు అందించేందకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐపీబీలో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా అధికారుల బృందం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని ప్రకటించారు. రామాయపట్నం పోర్టులో డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభం అవనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. మచిలీపట్నం పోర్టు పనులు నవంబరు నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.
రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపై దృష్టిసారించాలన్నారు. కేంద్రం మంజూరు చేసిన బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణ ప్రణాళిక సిద్ధమైనట్లు అధికారులు వివరించారు. చిన్నతరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రతి జిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున ఎంఎస్ఎంఈలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఎంఎస్ఎంఈలతో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇద్దరు- ముగ్గురు ఐఏఎస్ లతో బృందాన్ని ఏర్పాటు చేసి.. విదేశాల్లోని ఎంఎస్ఎంఈల రంగాన్ని అధ్యయనం చేయాలన్నారు. అక్కడి విధానాలు ఇక్కడ అనుసరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని పారిశ్రామిక నోడళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. మచిలీపట్నం, దొనకొండ నోడ్ళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా భవిష్యత్తులో రామాయపట్నం నోడ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.