ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన అందిస్తోన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం.. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాక.. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు నేరుగా అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటూ.. దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో తాజాగా మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల బైక్ని అందించనున్నారు. ఈ మేరకు ఏపీడీఏఎస్సీఏసీ (ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ) మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హులు ఈ నెల 31 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్లలోపు వారు ఈ పథకానికి అర్హులు. అలానే వీరు కనీసం పదో తరగతి పాసై ఉండాలని.. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలని అధికారులు తెలిపారు. సొంత వాహనం ఉన్నవాళ్లు ఈ పథానికి అనర్హులు. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఉండాలి. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు. అంతేకాక గతంలో ఈ వాహనాల కోసం దరఖాస్తు చేసినప్పటికీ.. మంజూరు కాకపోతే.. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించారు.
ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు.. జిల్లా మెడికల్ బోర్డు నుంచి ఇచ్చిన సంబంధిత ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ ధ్రువపత్రం, దివ్యాంగుల పూర్తి ఫొటో పాస్పోర్టు సైజులో, ఎస్సీ, ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం దరఖాస్తుతోపాటు ఏపీడీఏఎస్సీఏసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.