Arvind Goyal: కొంతమంది డబ్బు వెనక పరిగెడుతూ సమాజాన్ని మర్చిపోతారు. కానీ కొంతమంది మాత్రం ఎంత సంపాదించినా గానీ సమాజం కోసం పరుగులు పెడుతుంటారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలని పరితపిస్తుంటారు. ‘సమాజం నాకు ఎంతో ఇచ్చింది, తిరిగివ్వకపోతే లావైపోతాను’ అని సంపాదించిన దాంట్లో చాలా వరకూ సమాజానికే ఖర్చుపెడుతుంటారు కొంతమంది శ్రీమంతులు. అలాంటి వారిలో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కు చెందిన అరవింద్ కుమార్ గోయల్ ఒకరు. అపర కుబేరుడుగా పేరుగాంచిన ఈ పారిశ్రామికవేత్తకి ఎంత సంపాదించినా అందులో కొంత పేదల కోసం ఉపయోగించే గుడ్ హ్యాబిట్ ఉంది. పేదలకు తోచినంత సాయం చేస్తూ సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని పేదల కోసం విరాళమిచ్చారు. పేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం.. 50 ఏళ్ళుగా తాను కష్టపడి సంపాదించుకున్న రూ. 600 కోట్ల విలువైన ఆస్తిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. తమ కుటుంబం కోసం కేవలం ఒకే ఒక్క ఇంటిని ఉంచుకుని.. మిగతా ఆస్తులన్నిటినీ దానం చేశారు. ఈ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని గోయల్ కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది.
ఈయన ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, సామాజికవేత్త. స్థానికంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తోన్న ఈయన.. వందకు పైగా విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు. అంతేకాదు లాక్ డౌన్ సమయంలో మొరాదాబాద్ లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని.. అక్కడి ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేశారు. గోయల్ కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే ఆయన కుటుంబ సభ్యులు కూడా మద్దతిచ్చారట. గోయల్ తాను ఇలా సమాజం కోసం ఆలోచించడానికి ప్రేరేపించిన సంఘటన ఒకటి ఉంది. 25 ఏళ్ళ క్రితం రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ పేద వ్యక్తి గోయల్ ఎదురుగా కూర్చున్నాడట. ఆ సమయంలో చలి ఎక్కువగా ఉందట. ఆ వ్యక్తి ఒంటిపై కప్పుకోవడానికి ఏమీ లేదట. కాళ్లకు చెప్పులు కూడా లేని అతన్ని చూసి గోయల్ మనసు చలించిపోయిందట. అప్పుడు ఆయనకు చేతనైన సాయం చేశారట. కానీ ఆ తర్వాత దేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్లకు కూడా తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారట. అప్పటి నుంచి ఆయన పేదల కోసం సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా మొత్తం ఆస్తినే దానం చేశారు.
ఈయన తండ్రి ప్రమోద్ కుమార్, తల్లి శకుంతలా దేవి.. ఇద్దరూ స్వాతంత్య్రం కోసం పోరాడినవాళ్లే. ఆయన బావ సుశిల్ చంద్ర గతంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు. గోయల్ కూడా గతంలో సీబీడీటీ చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన అల్లుడు ఆర్మీలో కర్నల్ గా పనిచేస్తున్నారు. సమాజం కోసం గోయల్ చేస్తోన్న సేవలకు మెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు నలుగురు రాష్ట్రపతుల నుంచి ఆయన పురస్కారాలు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, అబ్దుల్ కలాంలు సైతం ఆయన్ను సత్కరించడం విశేషం. ధనవంతులంటే డబ్బున్న వాళ్ళు కాదు, జనం నుండి తీసుకున్న డబ్బును తిరిగి ఆ జనానికే పంచిపెట్టాలన్న మనసున్న వాళ్ళు, సంపన్న మనస్కులే అని ఈయన నిరూపించారు. మరి ఈ శ్రీమంతుడిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sonu Sood: మరోసారి దేవుడనిపించుకున్న సోనూసూద్.. 7 నెలల చిన్నారికి ఆపరేషన్!