అనేక మతాల, కులాల, భాషల కలయికే భారతదేశం. ఇక్కడ అన్ని కులాల, మతాల వారు అన్నదమ్ములా కలిసి మెలసి జీవిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మత సామరస్యాన్నికి ప్రతీకగా అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఒక మతం వారి వేడుకలకు ఇంకో మతం వారు సాయ సహకారాలు అందిస్తుంటారు. ఇటీవలే ఓ ముస్లిం కుటుంబం దసరా వేడుకల సందర్భంగా అమ్మవారికి రూ.60 లక్షల విలువ చేసే చీరను సమర్పించింది. తాజాగా ఓ ముస్లిం కుటుంబం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లా తిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచియంఖేడాలో హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే జిల్లా అధికారులు ఈ హనుమంతుడి పూర్తి స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. స్థానికులందరూ ఆలయ నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉంటున్న బాబు అలీ అనే వ్యక్తి కుటుంబం కూడా ఆలయ నిర్మాణం కోసం భూమిని విరాళంగా ఇచ్చింది. కేంద్ర హోం శాఖ మాజీ సహాయ మంత్రి స్వామి చిన్మయానంద జిల్లా పరిపాలనా అధికారుల సమక్షంలో బాబు అలీ తన భూమిని విరాళంగా ఇచ్చారు. ఇందుకు అవసరమైన పత్రాలను తిల్హార్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమికి సంబంధించిన రిజిస్టర్ ప్రక్రియను పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఆ భూ పత్రాలను బాబు అలీ హనుమంతుని పాదాల వద్ద ఉంచారు.
షాజహాన్పూర్లోని జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిల్హార్లోని కచియంఖేడాలో స్థాపించబడిన సుమారు 140 సంవత్సరాల పురాతన హనుమంతుడి ఆలయాన్ని నిర్మించే ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు. స్వామి చిన్మయానంద సరస్వతి పొలం యజమాని బాబు అలీతో మాట్లాడి.. ఆలయ నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని కోరారు. దీంతో బాబు అలీ తన కుటుంబ సభ్యులతో మాట్లాడి భూమిని ఇచ్చేందుకు అంగీకరించారు. బాబు అలీ తన ఐదుగురు కుమారులతో కలిసి టిల్హార్ పట్టణంలోని నివసిస్తున్నారు. బాబు అలీ చేసిన ఈ పని హిందూ-ముస్లిం ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని స్థానికులు తెలిపారు. జిల్లా అధికారులతో పాటు స్థానికులు బాబు అలీని అభినందించారు.