దేశంలో రోజూ ఎన్నో వింతలు, విఛిత్రాలు, అబ్బురపరిచే అంశాలు చూస్తుంటారు. కానీ, ఈ ఘటన గురించి ఎక్కడా చూసుండరు, వినుండరు. అదేంటంటే.. ఓ వృద్ధుడి కన్ను ఊడి చేతిలో పడింది. అవును మీరు చదివింది నూటికి నూరుశాతం నిజం. గిరిజన ప్రాంతంలోని ఓ వృద్ధుడు ఏడాది క్రితం కంటి సమస్యకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత కంటి నుంచి నీళ్లు రావడం, కన్ను బాగా దురదపెట్టడం జరిగింది. ఆ సమస్య విషయమై ఎంతో మంది వైద్యులను కలిసినా కూడా అతని సమస్యకు పరిష్కారం దక్కలేదు. ఓ రోజు కన్ను బాగా దురద పెట్టడంతో గట్టిగా రుద్దుకున్నాడు. ఇంకేముందు కన్ను ఊడి చేతిలో పడింది. దెబ్బకు అంతా విస్తుపోయారు.
అసలు ఏం జరిగిందంటే.. ఝార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఓ గిరిజన గ్రామం ఉంది. ఆ గ్రామంలో 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ గ్రామానికి చెందిన గంగాధర్ సింగ్ అనే వృద్ధుడు కొన్నాళ్లుగా కంటి చూపు మందగించి బాధపడుతున్నాడు. వారి గ్రామానికి ఓ మహిళ వచ్చింది. ఆమెకు వాళ్ల సమస్యలు చెప్పుకోగా ఓ ఎన్జీవో సహాయంతో 2021 నవబంరు నెలలో గంగాధర్ సింగ్తో పాటు మరికొందరికి జంషెడ్పూర్లోని ఓ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించారు. సర్జరీ చేసిన రెండ్రోజుల తర్వాత ఇంటికి పంపేశారు. అయితే ఇంటికి వచ్చిన రెండ్రోజుల నుంచి గంగాధర్ సింగ్కు మళ్లీ కంటి సమస్య వచ్చింది. కన్ను సరిగ్గా కనిపించకపోవడం, కంటి నుంచి నీళ్లు రావడం, దురద పెట్టడం ప్రారంభమైంది.
అయితే ఆ సమస్యకు సంబంధించి గంగాధర్ చాలా మంది వైద్యులను సంప్రదించాడు. వైద్యం చేసినా కూడా అతని సమస్య తీరలేదు. కంటి నుంచి నీళ్లు రావడం, బాగా దురద పెట్టడం కూడా జరుగుతోంది. ఓరోజు గంగాధర్ సింగ్ కన్ను బాగా దురదపెట్టడంతో గట్టిగా రుద్దుకున్నాడు. ఇంకేముంది అతని కన్ను ఊడి చేతిలో పడింది. ఆందోళనగా వృద్ధుడు ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. అక్కడి వైద్యులు కన్నుని పరీక్షించి అది గాజు కన్ను అని తేల్చారు. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. కన్ను కనిపించడం లేదంటే.. ఉన్న కంటిని తీసి గాజు కన్ను ఎలా పెట్టారంటూ ఉన్నతాధికారులకు సైతం అర్థం కాలేదు. సర్జరీ చేసిన వైద్యుడి ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఉన్న కంటిని తీసేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావడమే కాదు.. ఇప్పుడు అందరినీ ఆందోళన కూడా పెడుతోంది.