కొందరి స్వార్ధానికి, నిర్లక్ష్యానికి అనేక మంది అమాయకులు బలవుతుంటారు. నాణ్యతలేని వస్తువులను, గడువు తేదీ ముగిసిన వస్తువులను మార్కెట్ లో అమ్ముతుంటారు. అలాంటి వాటిని తెలియక కొనుగోలు చేసి ఎందరో అమాయకులు అనారోగ్యాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా కొందరి వ్యాపారుల నిర్లక్ష్యంగా కారణంగా పురుగులు ఉన్న పప్పులు, బియ్యం, కూరయాలు వస్తుంటాయి. మరికొన్ని చోట్ల మనం తినే ఆహార పదార్ధాల్లో పురుగులు ప్రత్యక్షమవుతుంటాయి. ఇక చాక్లెట్స్, బిస్కెట్స్ లో కూడా పురుగులు కనిపించిన ఘటనలు మనం ఎన్నో చూశాం. తాజాగా రోగులు వాడే ట్యాబ్లెట్ లో పురుగు ప్రత్యక్షమైంది. ఓ మెడికల్ షాపు నుంచి తెచ్చిన మాత్రలో పురుగులు కనిపించాయి. వాటిని బాధితులు గమనించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటక రాష్టంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి ప్రాంతంలో అంజలి అనే మహిళ తన భర్తతో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమె ప్రస్తుతం రెండు నెలల గర్భణి. ఈ క్రమంలో ఆరోగ్యానికి సంబంధించిన మందులు వేసుకుంటుంది. సెప్టెంబర్ 23న కలబుర్గిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెక్ చేయించుకుంది. అనంతరం అక్కడే ఉన్న మెడికల్ షాపులో వైద్యులు సూచించిన మందులు తెచ్చుకుంది. అక్కడి నుంచి తెచ్చిన జింకోవిట్ అనే ట్యాబ్లెట్ లో పురుగు ప్రత్యక్షమైంది. నారింజ రంగులో ఉన్న ఈ మాత్రలో చిన్న నల్ల పురుగులు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు ఆరోపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి నెలా అదే ఆసుపత్రిలో ఆరోగ్యం పరీక్షలకు వెళ్లినప్పుడు..అక్కడే మందులు తీసుకుంటున్నట్టుగా బాధితురాలు తెలిపింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు అదే షాపులో మందులు కొనుగోలు చేసినట్టుగా చెప్పింది. 15 రోజులకు సరిపడా మందులు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది. వాటిలో ఐదు వాడేసి.. గురువారం రోజున మరో ట్యాబ్లెట్ వేసుకునే సమయంలో అందులో పురుగులు కనిపించాయి. దీంతో ఆమె వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు మెడికల్ షాపు వారిని నిలదీయగా తమ దగ్గర ఆ మాత్రలు లేవని సమాధానం ఇచ్చారు. మెడికల్ షాపు సిబ్బందిపై అంజలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మాత్రలను వేసుకుంటే ఆ గర్భిణీ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.