సాధారణంగా పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తుంటారు. కొందరు క్రిమినల్స్ వెంటనే పోలీసులకు పట్టుబడతారు. మరికొందరు ఏళ్ల తరబడి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంటారు. ఎందుకంటే వారు చేసిన నేరాలు అంతటి దారుణమైనవి. దొరికితే శిక్ష మాములుగా ఉండదు. అయితే పప్పులు దొంగతనం చేసిన ఓ దొంగను గాలించేందు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లు పరారీలో ఉన్న ఆ దొంగను బుధవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి.. పప్పులు దొంగతనం చేసిన ఆ వ్యక్తి కోసం అంతలా ఎందుకు గాలించారు?. అసలు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీహార్కు చెందిన సంతోష్ కుమార్ (32) అనే వ్యక్తి స్థానికంగా దొంగతనాలు చేస్తూ జీవించే వాడు. ఇళ్లలో చొరబడి డబ్బులు, ఇతర విలువైన వస్తువులను అందిన కాడికి దోచుకుంటుంటాడు. అలా సంతోష్ కుమార్పై 12 దొంగతనాల కేసులు ఉన్నాయి. సంతోష్ గతంలో ఓ చోరీ కేసులు జైలుకి కూడా వెళ్లాడు. అయితే ఆ కేసులో బెయిల్ పై బయటి వచ్చాడు. అనంతరం పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నాడు. అయితే అప్పుడప్పుడు ఢిల్లీకి వచ్చేపోతుండే వాడు. ఆగష్టు18, 2011న ఓ గోడౌన్ లోకి ప్రవేశించి.. పప్పులు,తృణ ధాన్యాలు, బియ్యం ఇలా మొత్తం 230 బస్తాలను దొంగిలించి పారిపోయాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాచ్మెన్ను, కూలీలను బెదిరించినట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి పప్పుల దొంగ సంతోష్ పోలీసులకు చిక్కకుండా తిరిగే వాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్లో పర్యటించింది. అతడి కోసం పోలీసులు నిరంతరం సోదాలు, తనిఖీలు నిర్వహించేవారు.
అలా ఆ పప్పుల దొంగ కోసం వెతకడంలో తొమ్మిదేళ్లు గడచిపోయింది. ఎట్టాకేలకు సెప్టెంబర్ 26న బీహార్లోని అతని సొంత గ్రామమైన బంకాలో సంతోష్ కుమార్ పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు ఆసక్తికరమై విషయాలు వెల్లడించాడు. సంతోష్ కుమార్ లాగే గోడౌన్లలో వస్తువులను దొంగిలించి సగం రేటుకు విక్రయించే రాజేష్ పాశ్వాన్ తో పరిచయం అయిందని, ఆ తర్వాత ఇద్దరూ కలసి పలు దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. అలా ఇద్దరు కలిసి దొంగతనం చేసి పప్పులు, తృణధాన్యాలు, బియ్యాన్ని కూడా సగం ధరకే అమ్ముకున్నట్టు విచారణలో ఒప్పుకున్నాడు. ఇలా చోరీలకు పాల్పడుతూ..సంతోష్ కుమార్ గత కొన్నేళ్లుగా ఢిల్లీ, పాట్నా, భాగల్పూర్, బీహార్లో ఉండే వారి బంధువుల ఇళ్లలో తల దాచుకునేవాడు. మొత్తానికి ప్రత్యేక బృందం శ్రమ తొమ్మిదేళ్లకు ఫలించింది.