సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి అనగానే ప్రతి ఒక్కరి ఓ రకమైన భావన ఉంటుంది. తక్కువ పని, ఎక్కువ జీతాలు, నెల చివరే జీతం వచ్చిపడుతుదని కొందరి భావన. అలానే పదవి విరమణ అనంతరం పెన్షన్ కూడా వస్తుంది.. కాబట్టి వారి జీవిత చరమాకం వరకు ఎలాంటి ఆర్ధిక లోటు ఉండదులే అని అనుకుంటారు. అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం దక్కాల్సిన ప్రతిఫలం దక్కడం లేదు. కొందరి స్వార్ధానికి వీరు బలైపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. పాతికేళ్లు పాటు ప్రభుత్వం ఉద్యోగంతో ప్రజలకు సేవలు చేసినందుకు ప్రతిఫలంగా భిక్షాటన స్థితికి వెళ్లారు. ఆయన దీనస్థితిని చూసి ఓ వ్యక్తి.. కోర్టులో దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు 26 ఏళ్ల తరువాత ఆయనకు న్యాయం జరిగింది. ఈ ఘటన తమిళనాడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు రాష్ట్రం మధురై శివార్లులోని ఆలయాల వద్ద గత కొన్నేళ్లుగా ఓ పెద్దాయన భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో గుడికి వచ్చే భక్తులతో అనర్గళంగా ఇంగ్లీష్. తమిళ భాషలను మాట్లాడటం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలను తెలపడం చేస్తుండే వాడు. అయితే ఈ పెద్దయన వ్యవహారాన్ని గమనించిన ఓ భక్తుడు.. ఇటీవల ఆయన వివరాల ఆరా తీశాడు. చివరికి ఆ పెద్దాయన గురించి తెలుసుకుని షాకయ్యాడు. విచారణలో ఆ పెద్దయాన తంజవూరు జిల్లా తిరుచ్చిట్రంబలంకు చెందిన గోపాల్ గా గుర్తించారు. ఈయన అక్కడే అసిస్టెంట్ వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ 1996 పదవి విరమణ చేశారు. అయితే ఆ సమయంలో ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలం దక్కలేదు.
ఇందుకు కారణం ఆయన సహకార బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడమే. అలా రావల్సిన డబ్బులు ఆగిపోయి.. చదువును మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి రావడంతో ఆయన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో గోపాల్ మానసికంగా కుంగిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి కూడా చేయలేని స్థితిలోకి వెళ్లాడు. కూతుర్లు ఇద్దరు కూలీ పనులకు వెళ్తుండడంతో ఆయనకు జీవితంపై విరక్తి చెంది ఇంటి నుంచి బయటకి వెళ్లిపోయాడు. మధురై పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. తాజాగా ఓ భక్తుడి విచారణలో ఈ వృద్ధుడి వేదన వెలుగు చూసింది. ఆ భక్తుడు తన మిత్రుడైన న్యాయవాది జిన్నాకు సమాచారం ఇచ్చాడు.
దీంతో ఆ వృద్ధుడికి రావాల్సిన పదవీ విరమణ మొత్తం కోసం న్యాయవాది జిన్నా మద్రాసు హైకోర్టు.. మధురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ జస్టీస్ జీఆర్ స్వామినాథన్ బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. 74 ఏళ్ల వయస్సులో గోపాల్ పడుతున్న వేదనపై కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సహకార సంఘంలో ఆయన తీసుకున్న అప్పు ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.5.37 లక్షలకు చేరినట్లు అధికారులు కోర్టుకి వివరణ ఇచ్చారు. దీంతో ఆయనకు రావాల్సిన నగదలో రుణానికి జమ చేసుకుని,మిగిలిన సొమ్ముకు వడ్డీ లెక్కించి గోపాల్ కు ఆరువారాలలోపు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.