ఈ మధ్యకాలంలో ప్రజలు ఎలక్ట్రిక్ బైక్ వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారు.ముఖ్యంగా పెరుగుతున్న ఇంధనాల ధర కారణంగా వీటివైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అలాగే పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశం కూడా ఎలక్ట్రిక్ బైక్ ల వినియోగానికి మరో ప్రధానం కారణం. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగిస్తున్న ఈ బైక్ లు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇప్పటికి పలువురు వీటి కారణంగా మృతి చెందారు. తాజాగా మరొకరి ఇంట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ విషాదం నింపింది. బైక్ కి ఛార్జింగ్ పెట్టిన సమయంలో బ్యాటరీ పేలడం వల్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర లోని తూర్పు వసాయ్ ప్రాంతంలో రాందాస్ నగర్ కి చెందిన షానవాజ్ అన్సారీ అనే వ్యక్తి.. తన కుటుంబం తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతడికి షబ్బీర్ అనే కుమారుడు ఉన్నాడు. నిత్యం తన విధుల నిమిత్తం ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్లి వస్తుండే వాడు. అయితే సెప్టెంబరు 23 తేదీ తెల్లవారుజామున తన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. అనంతరం ఇంట్లో వెళ్లి పడుకున్నాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది.పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. కొంత సమయం పాటు ఏం జరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. బ్యాటరీ పేలిన సమయంలో అక్కడే ఉన్న షానవాజ్ అన్సారీ కుమారుడు షబ్బీర్, తల్లి రుక్సాన్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షబ్బీర్కు కాలిన గాయాలు ఎక్కువగా అవ్వడంతో చికిత్స పొందుతూ మరణించాడు.
స్కూటీ కంపెనీ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అది ప్లగ్ అయిందని బాలుడి కుటుంబం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీ ఎప్పటి నుంచి ఛార్జింగ్ అయిందో స్పష్టంగా తెలియదని పోలీసులు తెలిపారు. ఇన్ స్పెక్టర్ సంపత్ పాటిల్ మాట్లాడుతూ”ప్రస్తుతం ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసాము. ఇప్పటి వరకు కుటుంబం నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. స్కూటర్ 2021 మోడల్ కి చెందిన. బైక్ పేలడానికి గల కారణలపై కూడా విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు.